మోడీకి అంత సీన్ లేదు.. ఇదేం యూపీ కాదు, కన్నడ పాలిటిక్స్ వేరు: సిద్దరామయ్య
దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగినా.. కర్ణాటకలో మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య. మోడీ మాటల గారడీకి మోసపోయే కుయుక్తులు కర్ణాటకలో చెల్లవన్నారు. దేశవ్యాప్తంగా కాషాయ వికాసం
బెంగుళూరు: దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగినా.. కర్ణాటకలో మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య. మోడీ మాటల గారడీకి మోసపోయే కుయుక్తులు కర్ణాటకలో చెల్లవన్నారు. దేశవ్యాప్తంగా కాషాయ వికాసం జరిగినా కర్ణాటకలో బీజేపీ పాతాళానికి పడిపోవడం ఖాయమన్నారు.
కాగా, దక్షిణాదిలో పట్టుబిగించడం కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీకి.. ఒక్క కర్ణాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ రీతిలో పార్టీ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో బీజేపీ వ్యూహాలను ఇప్పటినుంచే ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు సిద్దరామయ్య.
ఇది యూపీ కాదు, ఇక్కడి పాలిటిక్స్ వేరు:
గోవధ నిషేధంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య ఆసక్తికర సమాధానం చెప్పారు. కర్ణాటక ఉత్తరప్రదేశ్ తరహా రాష్ట్రం కాదని, తమ పాలిటిక్స్ వేరుగా ఉంటాయని అన్నారు. బసవన్న లాంటి సామాజిక ఉద్యమ నాయకుడు పుట్టిన గడ్డ ఇది నొక్కి చెప్పారు. ఇలాంటి రాష్ట్రాన్ని కులాల పేరుతో విడదీయలేరని చెప్పారు.
హైకమాండ్ తో చర్చలు,:
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ హైకమాండ్ తో ఆదివారం నాడు సిద్దరామయ్య చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జేడీఎస్ వ్యూహాత్మక తప్పిదాల వల్లనే కర్ణాటకలో బీజేపీలో బలపడిందన్నారు. తిరిగి ఆ పార్టీ పాతాళానికి పడిపోయే సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలు దాన్నే రుజువు చేశాయన్నారు.
కేంద్రం సహకరిస్తే రుణమాఫీ:
పార్టీ బలోపేతంపై ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన సిద్దరామయ్య.. కేంద్రం సహకరిస్తే మాత్రం దానికి సిద్దమన్నారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పరిహారాన్ని ఇప్పించడంలో నిర్లక్ష్యం వహించే రాష్ట్ర బీజేపీ నాయకులు రుణమాఫీపై మాత్రం ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు.
మోడీ నిర్లక్ష్యం వల్లే:
సరిహద్దు రాష్ట్రాలతో అపష్కృతంగా ఉన్న నీటి సమస్యలను పరిష్కరించడం పట్ల మోడీ ఏమాత్రం శ్రద్ద వహించడం లేదని సిద్దరామయ్య అన్నారు. మహదాయి నదీ జలాల పంపిణీ గోవా, మహారాష్ట్రలో ముడిపడి ఉండటంతో.. ఆ రాష్ట్రాల ప్రభుత్వాల మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో మోడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
నదీజలాల
పంపిణీలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా.. బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదని సిద్దరామయ్య చురకలంటించారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని నిందించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.
రాజకీయ అవివేకం:
ఇక గుండ్లుపేట ఉపఎన్నిక గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా మహదేవ ప్రసాద్ పై మైసూరు ఎంపీ ప్రతాప సింహా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సిద్దరామయ్య తప్పుపట్టారు. అది ఆయన రాజకీయ అవివేకత్వానికి నిదర్శనమన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, ప్రజలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వాటి పరిష్కారినికి కృషి చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో ఇదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.