ప్రధాని మోడీకి కర్ణాటక కౌంటర్: దేశంలోనే నెంబర్ వన్, గుజరాత్ పాలన వద్దు స్వామి!
బెంగళూరు: కర్ణాటకలో శాసన సభ ఎన్నికల వేడి మొదలైయ్యింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చి వెళ్లిన తరువాత బీజేపీ-కాంగ్రెస్ నాయకుల మధ్య సమరం మొదలైయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆ రాష్ట్ర ఐటీ, బీటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. పెట్టబడులు, అభివృద్ది విషయంలో దేశంలోనే కర్ణాటక నెంబర్ వన్ స్థానంలో ఉందని కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ పాలన మాకు వద్దు స్వామి అంటున్నారు.
అవినీతిలో నెంబర్ వన్ !
అవినీతి, ప్రజల సోమ్ము దోపిడీ చేసే విషయంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ సిద్దరామయ్య ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అభివృద్ది విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాల వెనుకబడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
ఐటీ శాఖ మంత్రి ఫైర్
ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరుకు రావడం చాల సంతోషంగా ఉంది. అభివృద్ది విషయంలో నెంబర్ వన్ గా ఉన్న కర్ణాటక ప్రభుత్వం పనితీరును పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చారని ఆ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే ట్వీట్ చేశారు.
కర్ణాటకలో 44 శాతం !
పెట్టుబడుల విషయంలో దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే 44 శాతం పెట్టుబడులు ఒక్క కర్ణాటకలో పెట్టారని, 56 శాతం పెట్టుబడులు మిగిలిన రాష్ట్రాల్లో పెట్టారని, ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తే బాగుంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే అంటున్నారు.
366 డీల్స్ చేశాం
2017లో సిద్దరామయ్య ప్రభుత్వం అనేక సంస్థలతో సంప్రధించి 366 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించి విజయం సాధించామని, 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కర్ణాటకకు వచ్చాయని, ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ గమనిస్తే చాల సంతోషిస్తామని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే చెప్పారు.
గుజరాత్ పాలన వద్దు
దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ది విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, తాము మాత్రం గుజరాత్ రాష్ట్ర అభివృద్దిని ఆదర్శంగా తీసుకోవడానికి ఆసక్తి చూపించమని మంత్రి ప్రియాంక్ ఖార్గే ప్రధాని నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలపై ఘాటుగానే సమాధానం ఇస్తోంది.