తక్కువ జాతి అంటూ రూంలో దాడి చేసి అంతం చేస్తాను అన్నాడు, అందుకే: కాంగ్రెస్ఎమ్మెల్యే !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో మాయం అయిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం దూమరం రేపింది. తాను ఆనంద్ సింగ్ మీద కోపంతోనే దాడి చేశానని, ఆయన తనను నీచంగా మాట్లాడారని నువ్వు తక్కవ జాతి వాడు అంటూ రూంలో దాడి చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు.
అజ్ఞాతం నుంచి వివరణ
అజ్ఞాతంలో ఉన్న కంప్లీ ఎమ్మెల్యే గణేష్ తాను ఆనంద్ సింగ్ మీద ఎందుకు దాడి చెయ్యాల్సి వచ్చింది అంటూ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. ఆరోజు రాత్రి విందులో మేము ఇద్దరూ కలిశామని చెప్పారు. డిన్నర్ అయిన తరువాత తనను ఆనంద్ సింగ్ ఆయన గదికి తీసుకెళ్లారని గణేష్ అంటున్నారు.
ఆర్థికంగా దెబ్బ తీశాను !
గత ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా నిన్ను పోటీ చేయించాలని మీ తండ్రి దగ్గరకు రెహమాన్ సాబ్ ను తానే పంపించానని, ఆర్థికంగా నిన్ను దెబ్బ తీశానని ఆనంద్ సింగ్ అన్నారని గణేష్ వివరించారు. తనను రాజకీయంగా దెబ్బ తీస్తానని ఆనంద్ సింగ్ బెదిరించాడని, రోడ్డు మీద అడుక్కునేలా చేస్తానని బెదిరించాడని గణేష్ ఆరోపించారు.
తక్కువ జాతి !
తక్కువ జాతి (వాల్మీకి) అయిన నీవు నా ముందు కుర్చుంటావా, నీకు ఎంత ధైర్యం, నీవెంత నీ చరిత్ర ఎంత, నాముందు ఇలా ఉన్నావంటే నేను లేనప్పుడు ఎలా ఉంటావు అని ఆనంద్ సింగ్ దూషించారని గణేష్ ఆరోపించారు. నీవు తక్కవ జాతి వాడు అంటూ ఆనంద్ సింగ్ దూషించాడని గణేష్ ఆరోపించాడు.
కులం పేరుతో కాలితో !
అసలు నీ కులం (వాల్మీకి) ఏంది, నువ్వు ఏంది, నన్ను ఎదిరించడానికి సిద్దం అయ్యావా ? నీ బతుకెంత, నీ అంతు చూస్తానని ఆనంద్ సింగ్ బెదిరించారని గణేష్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు వాల్మీకి కులస్తులు ( కాంగ్రెస్ ఎమ్మేల్యేలు గణేష్, భీమా నాయక్) తనను ఓడించాలని చాల ప్రయత్నాలు చేశారని, ఆ విషయం తనకు తెలుసని, మీ అంతు చూస్తానని ఆనంద్ సింగ్ బెదిరించారని గణేష్ ఆరోపించారు.
ఆనంద్ సింగ్ దాడి
తన మీద ఆనంద్ సింగ్ మొదట దాడి చేశాడని, తరువాత కోపంతో తాను ఆయన మీద దాడి చేశానని గణేష్ ఆరోపిస్తున్నాడు. కులం పేరుతో తనను దూషించి అంతం చేస్తానని చెప్పడంతో తాను సహనం కోల్పోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఆరోపిస్తున్నాడు. మొత్తం మీద గణేష్ అందించిన సమాచారంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. గణేష్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.