పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల.. కోరిక తీరగానే సైనైడ్ తో హతం.. దేశంలోనే డేంజరస్ సీరియల్ కిల్లర్..
క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలదన్నే రీతిలో.. పెళ్లి పేరుతో యువతులు, మహిళల్ని లోబర్చుకుని.. కోరిక తీరిన తర్వాత వాళ్లందరినీ కిరాతకంగా హతమార్చి.. కర్ణాటకలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ అలియాస్ 'సైనైడ్ మోహన్' చివరిదైన 20వ హత్య కేసులోనూ దోషిగా తేలాడు. 2009లో కేరళకు చెందిన యువతిని బెంగళూరుకు తీసుకొచ్చి తన స్టైల్లో హతమార్చిన కేసులో ఆధారాలు పక్కాగా ఉండటంతో మంగళూరు కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది.
Recommended Video

ఇదీ క్రైమ్ హిస్టరీ..
2005 నుంచి 2009 వరకు కర్ణాటక పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు సైనైడ్ మోహన్. పెళ్లి పేరుతో యువతులు, మహిళలకు వలవేసి, కామవాంఛ తీరిన తర్వాత వాళ్లకు సైనైడ్ పూసిన ట్యాబ్లెట్ ఇచ్చి సైలెంట్ గా చంపేసేవాడు. అలా నాలుగేళ్ల వ్యవధిలో మొత్తం 20 మందిని హత్య చేశాడు. అన్ని మరణాలకు సైనైడే కారణమని తేలడంతో అతని పేరు ‘సైనైడ్ మోహన్'గా స్థిరపడిపోయింది.

ఇప్పటికే 5 సార్లు మరణశిక్ష..
సైనైడ్ మోహన్ నేరాలకు సంబంధించి మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. తాజాగా చివరిదైన కేరళ యువతి హత్య కేసులోనూ అతను దోషిగా తేలాడు. గతంలో 19 కేసుల్లోనూ అతను కన్విక్ట్ గా నిర్ధారణ అయింది. ఐదు కేసుల్లో మోహన్ కు మరణశిక్ష పడగా, మరో మూడు కేసుల్లో జీవితఖైదు విధించారు. ఇంకో రెండు కేసుల్లో మరణశిక్ష విధించినప్పటికీ.. వాటిని జీవితఖైదుగా మార్చారు. చివరి కేసుకు సంబంధించి ఈ నెల 24న శిక్ష ఖరారుకానుందని పోలీసులు చెప్పారు.

చివరికి ఇలా..
వరుస హత్యలతో బెంగళూరుతోపాటు కర్ణాటక మొత్తాన్ని షేక్ చేసిన సైనైడ్ మోహన్.. చివరిగా 2009 జులైలో కేరళకు చెందిన యువతిని అంతమొందించాడు. కాసర్ గోడ్ లోని ఓ లేడీస్ హాస్టల్ లో వంట మనిషిగా పనిచేసే యువతితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుందామంటూ బెంగళూరుకు తీసుకొచ్చాడు. మెయిన్ బస్టాండ్ కు సమీపంలోని ఓ లాడ్జిలో శారీరకంగా అనుభవించిన తర్వాత, ఆమె నగలన్నీ మూట గట్టుకున్నాడు. ఊరికి వెళదామంటూ ఆమెను బస్టాండ్ దగ్గరికి తీసుకెళ్లి.. గర్భనిరోదక మాత్రలంటూ సైనైడ్ కలిపిన ట్యాబ్లెట్ ను మింగించి, నగలతో ఉడాయించాడు. బస్లాండ్ ఆవరణలోని టాయిలెట్ వద్ద విగత జీవిగా పడిఉన్న ఆ యువతిని పోలీసులు గుర్తించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

ఎలా దొరికిపోయాడంటే..
మోహన్ మాయమాటలు నమ్మి అతని కోసం బెంగళూరు వచ్చిన యువతి.. కేరళలోని తన చెల్లికి ఫోన్ చేసి.. తాము పెళ్లి చేసుకున్నామని, ఇతనే తన భర్త అంటూ మోహన్ తో దిగిన ఫొటోలను పంపింది. మీడియాలో తన సోదరి మరణం గురించి తెల్సుకున్న ఆ చెల్లెలు.. బెంగళూరు పోలీసులను సంప్రదించి, మోహన్ ఫొటోలను చూపించింది. వాటి ఆధారంగా మూడు నెలలపాటు వేటాడిన పోలీసులు ఎట్టకేలకు 2009 అక్టోబర్ లో మోహన్ ను అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా.. మొత్తం 20 హత్యలకు సంబంధించిన నిజాలను కక్కేశాడు. దేశంలో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన డేంజరస్ సీరియల్ కిల్లింగ్ కేసుల్లో సైనైడ్ మోహన్ హత్యాకాండ కూడా ఒకటని కర్ణాటక పోలీసులు చెబుతారు.












Click it and Unblock the Notifications