ఫ్యామిలీతో కలిసి ఐటీ శాఖ కార్యాలయానికి మంత్రి డీకే శివకుమార్, విచారణ, ఆడిటర్ వద్దు !
కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారుల ముందు హాజరైనారు.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారుల ముందు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు విచారణ చేస్తున్నారు.
డీకే. శివకుమార్ తన తల్లి గౌరమ్మ, భార్య ఉషా, కుమార్తె ఐశ్వర్య, సోదరుడు, పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్, సోదరితో కలిసి బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డులోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్బంలో ఆదాయపన్ను శాఖ అధికారులు డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు.
ఆడిటర్ ను పిలుచుకురాకూడదని, విచారణకు సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేశారు. అయితే న్యాయవాది, ఆడిటర్ తో సుధీర్ఘంగా చర్చించిన మంత్రి డీకే శివకుమార్ ఆలస్యంగా ఆదాయ పన్ను శాఖ అధికారుల ముందు హాజరైనారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఆదాయపన్ను శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చి తనను వేధిస్తున్నారని మంత్రి డీకే శివకుమార్ తన సన్నిహితుల దగ్గర వాపోయారని తెలిసింది, ఇప్పటికే ఏడు సార్లు సమన్లు జారీ చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు మంత్రి డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.