ఒకే ఎంపీ టిక్కెట్ కోసం మామ అల్లుళ్ల సవాల్, కూతురి భర్తతో మాజీ కేంద్ర మంత్రి ఢీ, మోదీ స్కెచ్ తో !
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని చాలా మంది నాయకులు ఇప్పటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో తనకంటూ పట్టు సంపాధించుకున్న కర్ణాటక మంత్రి కేహెచ్ మునియప్పకు ఈసారి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందనే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పోరు రసవత్తరంగా సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ కేహెచ్ మునియప్ప, ఆయన అల్లుడు చిక్కపెద్దన్నపేర్లు ఒకే లోక్ సభ నియోజక వర్గం నుంచి బలంగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. కోలార్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ సొంత పార్టీలో విభేదాల కారణంగా గత లోక్ సభ ఎన్నికల్లో కేహెచ్ మునియప్ప ఓడిపోయారు.

కోలారు లోక్ సభ నియోజక వర్గం నుంచి ఓటమిలేని నాయకుడిగా వరుసగా ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించిన కేహెచ్ మునియప్ప మొదటి సారి గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ రకరకాల కసరత్తులు చేస్తుండడంతో కోలారు లోక్ సభ టిక్కెట్టుకు గట్టి పోటీ ఎదురవుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్లు ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి.

జేడీఎస్ కూడా బలంగా ఉన్న కోలారులో బీజేపీ-జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో కూడా ఎవరికి టిక్కెట్టు వస్తుందో ఇంకా తేలలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కే.హెచ్. మునియప్ప లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమేనని చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు ఉన్న కేహెచ్ మునియప్ప ఎలాగైనా ఎంపీ టిక్కెట్ తెచ్చుకుంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
ఈలోగా కేహెచ్ మునియప్పను ఎన్నికల బరిలో నిలపాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, కోలార్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా అయోమయానికి స్వస్తి పలకాలని పలువురు కాంగ్రెస్ నేతల బృందాలు బృందాలుగా వెళ్లి కేహెచ్ మునియప్పు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు మునియప్పకు బదులుగా ఆయన అల్లుడు, ప్రభుత్వ ఉద్యోగి అయిన చిక్కపెద్దన్నను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె సరిహద్దులోని చింతామణి తాలూకా కొడిగల్కు చెందిన చిక్కపెద్దన్నకు టికెట్ ఇవ్వడంతో మునియప్ప, రమేష్కుమార్ వర్గాల మధ్య విభేదాలు సమసిపోతాయని, మునియప్ప మద్దతుతో ఎన్నికల్లో కాంగ్రెస్ సులువుగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. చిక్కపెద్దన్న అధికారికంగా రాజకీయాల్లోకి రాకపోయినా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రంగంలోకి దిగి తనకంటూ ప్రజల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కపెద్దన్నకు చింతామణి నేపథ్యం ఉండటంతో కోలార్ రాజకీయాలపై అవగాహన పెంచుకుని నేతలందరి విశ్వాసాన్ని చూరగొని ఎన్నికలను ఎదుర్కోంటారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. సమర్ధవంతమైన ప్రభుత్వ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న చిక్కపెద్దన్నకు కోలారు ఎంపీ టికెట్ ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ మీద ఇప్పటి నుంచి ఒత్తిడి తెస్తున్నారని వెలుగు చూసింది.

మొత్తం మీద ఒకే లోక్ సభ నియోజక వర్గం ఎంటీ టిక్కెట్ మామకు లేదంటే అల్లుడికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేహెచ్ మునియప్ప కుమార్తె ఇప్పటికే రెండు సార్లు కేజీఎఫ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంచి నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. మొత్తం మీద ఒకే ఇంటి నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు












Click it and Unblock the Notifications