ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. ఆదాయపన్ను శాఖ అధికారుల దాడలు చెయ్యడంతో ఇప్పుడు డీకే. శివకుమార్ కు మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
డీకే. శివకుమార్ అక్రమంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1,000, రూ. 500 నోట్లు భారీ మొత్తంలో బయటపడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను చెల్లించకుండా ఆయన అక్రమంగా ఆర్థికలావాదేవీలు నిర్వహించారని సమాచారం.
మంత్రి పదవి అడ్డం పెట్టుకుని అధికార దుర్వనియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు అధికారికంగా మొత్తం విషయాలు బయటకు చెప్పినప్పుడు అసలు నిజం వెలుగు చూస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇంత కాలం తాము ఆదాయపన్ను చెల్లించి చట్టప్రకారం వ్యాపారం చేశామని మీడియాకు చెప్పిన మంత్రి సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ ఇప్పుడు మాటమార్చాడు. ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము మొత్తం డీకే. శివకుమార్ ది కాదని శుక్రవారం మీడియాకు చెప్పారు.