కూతురి స్కూల్ ఫీజు గురించి ఈడీ ఆరా: ఎన్నికల వేళ..డీకేకు మళ్లీ సమన్లు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతకస్థాయికి చేరుకుంటోన్న వేళ..ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారరులు కొరడా ఝుళిపించారు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది.. పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యూలర్) తమ ప్రచార తీవ్రతను పెంచాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలు, చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిస్తోన్నారు.

త్వరలో షెడ్యూల్..
ఈ నెల చివరివారం లేదా మార్చి మొదటివారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈడీ ఎంట్రీ..
ఈ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కు నోటీసులను జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో ఆయనకు ఈ సమన్లు అందాయి. బెంగళూరులోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.

స్కూల్ ఫీజు గురించి ఆరా..
ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడంపై డీకే శివకుమార్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ్వాళ ఆయన శివమొగ్గలో పర్యటిస్తోన్నారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు తనకు మరోసారి సమన్లు జారీ చేశారని అన్నారు. తన కూతురిని కూడా వారు విచారించారని, స్కూల్ ఫీజులు ఎలా కట్టారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పరీక్షల రిజల్ట్ గురించి ఆరా తీశారని చెప్పారు.

22 సార్లు హాజరయ్యా..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే తాను 22 సార్లు ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారని, అన్ని వివరాలను వారి ముందు ఉంచానని అన్నారు. ఈ కేసులో తవ్వి తీయడానికి ఇంకేమీ లేదని, అందుకే ఈడీ అధికారులు తన కూతురిని కూడా విచారించి స్కూల్ ఫీజులు, రిజల్స్ట్ గురించి ప్రశ్నిస్తోన్నారని ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల ప్రచారం చేసుకోవాలా? లేక రోజూ వెళ్లి ఈడీ అధికారుల ముందు కూర్చోవాలా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications