17 కేజీల బంగారం స్వాదీనం: ఇంటి దొంగ అరెస్టు
బెంగళూరు/చిక్కమగళూరు: యజమాని కళ్లు గప్పి స్నేహితులతో కలిసి 18 కేజీల బంగారం లూటీ చేసిన డ్రైవర్ను, అతని అనుచరులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
బాబు (కారు డ్రైవర్), శివకుమార్, మన్సూర్ అహమ్మద్, విశ్వనాథ్ అనే నలుగురిని అరెస్టు చేశారు. బెంగళూరులో ఓం ప్రకాష్ జ్యవెలర్స్ ఉంది. ఈ షోరూం యజమాని రాజేష్ భట్. రాజేష్ భట్ కోల్ కత్తాలో 18 కేజీ బంగారం తీసుకుని వచ్చాడు.
ఈ నెల 6వ తేదిన స్నేహితులతో కలిసి 18 కేజీల బంగారం కారులో పెట్టుకుని బయలుదేరాడు. రాజేష్ కారు డ్రైవర్ బాబు. కోలారు సమీపంలోని అడిగాస్ హోటల్ దగ్గర కారు నిలిపారు. రాజేష్ భోజనం చెయ్యడానికి వెళుదామని చెప్పారు. ఆ సమయంలో డ్రైవర్ బాబు తనకు భోజనం వద్దని అన్నాడు.
రాజేష్ అతని స్నేహితులు బోజనం చెయ్యడానికి హోటల్ లోకి వెళ్లారు. ఆ సందర్బంలో బాబు బంగారు నగలు ఉన్న యజమాని కారుతో సహ అక్కడి నుండి పరారైనాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత బంగారు నగలు శివకుమార్ కారులో వేసుకుని చిక్కమగళూరు పరారైనారు.
చిక్కమగళూరు సమీపంలో పొలం దగ్గర ఉన్న పశువుల పాకలో బంగారు నగలు పాతిపెట్టారు. ఒక కేజీ బంగారు నగలు కుదవ పెట్టిన నిందితులు చిక్కమగళూరు లాడ్జ్ లో గది అద్దె తీసుకుని జల్సా చేస్తున్నారు. అప్పటి నుండి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు పక్కా సమాచారం తెలుసుకున్నారు.
గురువారం రాత్రి కోలారు, చిక్కమగళూరు పోలీసులు లాడ్జ్ మీద దాడి చేసి నిందితులను అరెస్టు చేసి 17 కేజీల బంగారం స్వాదీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.