వ్యభిచారుల కంటే హీనంగా ప్రయివేటు స్కూల్స్: మంత్రి
బెంగళూరు: ప్రయివేటు విద్యా సంస్థలు నడుపుతున్నవారి మీద కర్ణాటక సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయ మండిపడ్డారు. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మనవి చేశారు.
వ్యభిచారుల కంటే హీనంగా విద్యా సంస్థల యాజమాన్యం ప్రవర్తిస్తున్నదని ఘాటుగా స్పందించారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సరస్వతి తల్లిని నడి రోడ్డులో అమ్ముకుంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఉన్నంత వరకు పేద వారికి ఉన్నత విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ప్రయివేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి శశికుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. లక్షల మంది విద్యార్థులకు విద్య చెబుతున్న మమ్మల్ని వేశ్యలతో పోల్చిన మంత్రి ఆంజనేయ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తరువాత స్పందించిన మంత్రి ఆంజనేయ తాను అన్ని ప్రయివేటు విద్యా సంస్థల గురించి మాట్లాడలేదని, ఎక్కువ డోనేషన్లు వసూలు చేస్తున్న యాజమాన్యం మీద విమర్శలు చేశానని స్పష్టం చేశారు. మొత్తం మీద విద్యా సంస్థల యాజమాన్యాన్ని వ్యభిచారులతో పోల్చిన మంత్రి ఆంజనేయ ఇప్పడు కాంగ్రెస్ పార్టీకి తల నొప్పిగా మారారు.