పోలీసు బాస్కే కుచ్చుటోపి: రూ. 10 వేలు హాంఫట్
బెంగళూరు: క్రెడిట్ కార్డు పిన్ కోడ్ తెలుసుకుని స్వయంగా పోలీస్ బాస్ కే కుచ్చుటోపి పెట్టిన ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన దీప్ కుమార్ అలియాస్ దీపు, అతని స్నేహితుడు అశ్రఫ్ ఆలీ అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
కర్ణాటక డీజీపీ (పోలీస్ బాస్) ఓంప్రకాష్ నే స్వయంగా మోసం చేసి ఆన్ లైన్ లో డబ్బులు డ్రా చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇదే సంవత్సరం ఏప్రిల్ 21వ తేదిన డీజీపీ ఓంప్రకాష్ మొబైల్ కు ఫోన్ చేశారు.
తాము ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది అని పరిచయం చేసుకున్నారు. మీ క్రెడిట్ కార్డును రెన్యువల్ చేస్తున్నామని పిన్ నెంబర్ చెప్పాలని మనవి చేశారు. ఆ సందర్బంలో డీజీపీకి ఎలాంటి అనుమానం రాలేదు. వెంటనే క్రిడిట్ కార్డు పిన్ నెంబర్ చెప్పారు.
వివరాలు సేకరించిన నిందితులు ఒక గంట వ్యవధిలో ఆన్ లైన్ లో రూ. 10,000 డ్రా చేసుకున్నారు. డీజీపీ ఓం ప్రకాష్ మొబైల్ కు రూ. 10 వేలు డ్రా అయ్యిందని మెసేజ్ వచ్చింది. అంతే షాక్ కు గురైన డీజీపీ ఓం ప్రకాష్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు. నిందితులు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారని పసిగట్టారు. ఢిల్లీ చేరుకుని ఇద్దరిని అరెస్టు చేసి బెంగళూరు తీసుకు వచ్చారు. తన డబ్బులు పోయాయని బాధగా లేదని, అయితే తనకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని డీజీపీ ఓంప్రకాష్ అంటున్నారు.