ఏం జరుగుతోంది: యుద్ధవాతావరణం నేపథ్యంలో కర్తాపూర్ కారిడార్పై భారత్ పాక్ చర్చలు
ఢిల్లీ: మార్చి 14న కర్తాపూర్ కారిడార్కు సంబంధించి భారత్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అది పాకిస్తాన్తో చర్చలుగా భావించరాదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్తో ఇప్పట్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఈ మేరకు మీడియాతో చెప్పారు. భారత్ పాక్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఇప్పట్లో జరగవని ఆయన స్పష్టం చేశారు. అయితే కర్తాపూర్ కారిడార్ అంశం సిక్కుల మత విశ్వాసానికి సెంటిమెంటుకు సంబంధించిన అంశంగా ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మార్చి 14న కర్తాపూర్ అంశంపై చర్చించేందుకు పాకిస్తాన్ నుంచి ఓ బృందం భారత్కు రానుంది. ఈ సందర్భంగా కర్తాపూర్ కారిడార్కు సంబంధించి డ్రాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకోనుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయా అని భారత్ పాక్తో పాటు ఇతర ప్రపంచదేశాలు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేయడంతో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.
ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్
ఫిబ్రవరి 14 ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్పై భారత్ విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రపంచదేశాలు కూడా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ తర్వాత రెండు వారాలకు భారత్ పాకిస్తాన్లోకి వెళ్లి బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత వైమానిక దళం పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టాయి.