మైలేజీ ఎక్కడ తగ్గింది?: సీట్లు పెరిగినా 'కరుణ' దూరమే
చెన్నై: 'నాకు చివరిసారిగా అవకాశం ఇవ్వండి. తమిళ ప్రజలకు మరింత సేవ చేయాలని ఉంది. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా' అంటూ తమిళనాట సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరించాలని 92 ఏళ్ల వయసులో ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి చెప్పిన మాటలివి.
అయితే పోలింగ్ రోజున సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే కూటమి విజయం ఖాయమని తేలడంతో కరుణానిధిలో ఎక్కడో ఒకమూలన సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నాననే చిన్న ఆశ వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ అమ్మను ఇంటికి పంపించి కరుణానిధిని ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో అన్నా డీఎం కార్యకర్తలు ఢీలా పడిపోయారు.
గత కొన్నిరోజులుగా చెన్నైలోని జయలలిత నివాసం వద్ద నిశ్శబ్ధం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే గురువారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ చరిత్ర సృష్టించింది. కరుణానిధిపై తమిళ తంబీలు కరుణ చూపించినా సీఎం పీఠాన్ని మాత్రం చేరుకోలేకోపోయారు.
వాస్తవానికి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉచితాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ డీఎంకే తమ పంథా కాస్త మార్చినట్లు కనిపిస్తోంది. మేనిఫెస్టోలో ఉచిత హామీలను ఆ పార్టీ బాగా తగ్గించింది. ఇది కూడా డీఎంకే ఓటమికి కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వీటితి తోడు డీఎంకే ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి సంపూర్ణ మద్య నిషేధం. తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తామని కరుణానిధి ప్రకటించారు. అటు చిన్న, సన్నకారు రైతుల రుణాలతోపాటు విద్యా రుణాలు కూడా రద్దు చేస్తామని డీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది.
ఈ హామీలేవి తమిళ తంబీలను పెద్దగా ప్రభావితం చేయలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 2011లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు డీఎంకేకి సుమారు 97 స్థానాలు వరకూ గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, అధికారం మాత్రం జయలలితకే కట్టబెట్టారు.
మరోవైపు ఇదే సమయంలో 2011లో 160 స్థానాలను దక్కించుకున్న జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, ఇప్పుడు 140 సీట్లకే పరిమితం కానుంది. కాగా, 2011 ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీ 29 స్థానాల్లో గెలవగా, ఇప్పుడు ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటుని కూడా గెలుచుకోలేకపోయింది.
తమిళనాడు ఎన్నికల్లో జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తప్పని తేలాయి. సాధారణంగా తమిళనాడులో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి జయలలిత ఆ సంప్రదాయాన్ని తిరగరాసారు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications