జయలలితను వదలం, అపీల్కు వెళ్తాం: కరుణానిధి
చెన్నై: తమిళనాడులో రాజకీయ వైరాలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. కరుణానిధి అధికారంలో ఉన్న సమయంలో జయలలిత, ఆమె పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కరుణానిధి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు.
ఇప్పుడు జయలలిత మీద నమోదు అయ్యి కొట్టి వేసిన అక్రమాస్తుల కేసు విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎం. కరుణానిధి మొదటిసారి స్పందించారు. తాము జయలలిత కేసు విషయంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని అన్నారు.

సోమవారం చెన్నైలో లో డీఎంకే పార్టీ జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంలో కరుణానిధి హాజరైనారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈ తీర్పుపై తాము సుప్రీంలో అప్పీలు చేస్తామని చెప్పారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ జయలలిత కేసును సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని ఇప్పటికే చెప్పారని అన్నారు. అంతే కాకుండా డీఎంకే ప్రధాన కార్యదర్శి అంబళగన్ కూడ ఈ కేసులో ఒక పిటిషనర్ అని గుర్తు చేశారు.
జయలలిత మీద అక్రమాస్తుల కేసు పెట్టిన బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి సైతం సుప్రీంకు వెళ్లాలని అంటున్నారని కరుణానిధి చెప్పారు. జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడు రోజులు గడవకముందే రాజకీయ ప్రత్యర్థి అయిన కరుణానిధి ఈ వ్యాఖ్యలు చెయ్యడంతో అమ్మ అభిమానులు షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications