"ఫైల్ పై సంతకం చేసేంత ఆరోగ్యంగా జయ ఉన్నారా?"
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో.. తమిళ రాజకీయాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అమ్మ కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందనేది ఖచ్చితంగా నిర్ధారించలేని పరిస్థితిలొ.. పరిపాలనా దృష్ట్యా.. జయలలిత వద్ద ఉన్న శాఖలను జయ నమ్మిన బంటు పన్నీర్ సెల్వమ్ కు బదలాయింపు చేసిన సంగతి తెలిసిందే.
అయితే జయలలిత ఆదేశాల మేరకే ఈ శాఖల బదలాయింపు జరిగిందని చెబుతోన్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాఖల బదలాయింపుకు సమ్మతిస్తూ జయలలిత నిజంగానే ఫైల్ పైన సంతకం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఫైల్ పై సంతకం చేసేంత ఆరోగ్యంగా జయ ఉన్నారా? అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు కరుణానిధి. వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, స్టాలిన్ వంటి నేతలు ఆసుపత్రికి వెళ్లినప్పుడు జయతో నేరుగా కలిసి మాట్లాడేందుకు ఎందుకు అనుమతించలేదని కరుణానిధి ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

19 రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటున్నా.. జయ ఆరోగ్యంపై ఇప్పటికీ ఖచ్చితమైన వివరాలేవి వెల్లడి కాకపోవడంపై అసంత్రుప్తి వ్యక్తం చేశారు కరుణ. ఇంకెంతకాలం జయకు చికిత్స అవసరమవుతుందో ఎవరికీ అంతుచిక్కకుండా మారిందన్నారాయన. శాఖల బదలాయింపుల గురించి ప్రస్తావిస్తూ.. రాజ్యాంగంలోని అన్ని కోణాలను పరిశీలించాకే గవర్నర్ శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారా? అని కరుణానిధి ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అమ్మ ఫోటోలు విడుదల చేయాలని ఈ సందర్బంగా కరుణ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కరుణానిధి తనయుడు స్టాలిన్ మాత్రం శాఖల బదలాయింపు నిర్ణయాన్ని నిన్న స్వాగతించడం గమనార్హం.












Click it and Unblock the Notifications