వారణాశి..కాషాయమయం: మహదేవుడే పాలకుడు: కార్మికులకు మోడీ సన్మానం: పూలు చల్లి..
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్.. కాశీ విశ్వనాథ్ కారిడార్- అందుబాటులోకి వచ్చింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉత్తర ప్రదేశ్లోని వారణాశిలో కొద్దిసేపటి కిందటే ఆయన ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఇది ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం. కాశీ విశ్వనాథుడి మందిరం, కాల భైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 339 కోట్ల రూపాయల పైమాటే.
వారణాశి కాషాయమయం..
ఈ కారిడార్ను ప్రారంభించడానికి ప్రధాని ఈ ఉదయం వారణాశికి చేరుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దారి వెంట పూలచల్లి ఆయనను ఆహ్వానించారు. రోడ్డు ఇరువైపులా నిల్చుని ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరహర మహదేవ్ నినాదాలతో ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం మారుమోగిపోయింది. వారణాశి మొత్తం పండగ వాతావరణం నెలకొంది. నగరం మొత్తం కాషాయమయమైంది. ఫ్లెక్సీలు, బ్యానర్లకు లెక్కే లేదు.

వారణాశిలో ప్రభుత్వం లేదు..
వారణాశిలో మరే ఇతర ప్రభుత్వం లేదని, ఇక్కడ ఆ కాశీ విశ్వనాథుడే పరిపాలకుడని ప్రధాని వ్యాఖ్యానించారు. తాము అందరం ఆయన సేవకులం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రాచీన వైభోగాన్ని చెక్కు చెదరనివ్వకుండా.. అత్యంత అధునాతనంగా ఈ కారిడార్ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దామని అన్నారు. నిర్దేశిత గడువులోగా దీన్ని పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమించిందని కొనియాడారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు.

కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు..
కారిడార్ను ప్రారంభించడానికి ముందు గంగానదీలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం పుణ్యస్నానం చేశారు. అక్కడి ఆలయాలను ప్రధాని సందర్శించారు. కాలభైరవేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహవించారు. కాల భైరువుడిని వారణాశి క్షేత్రపాలకుడిగా పూజిస్తారు. కొత్వాల్గా భావిస్తారు. అనంతరం లలిత ఘాట్ వద్ద గంగానదికి పూజలను నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయం కాశీ విశ్వనాథుడిని దర్శించారు. అరగంట పాటు పూజలు చేశారు. కాశీ విశ్వనాథుడి లింగానికి అభిషేకించారు.

కార్మికులకు సన్మానం..
అనంతరం ప్రధాని ఘాట్ వద్ద కార్మికులను కలుసుకున్నారు. వారందరినీ కూర్చోబెట్టి.. వారిపై పూలు చల్లారు. ఈ కారిడార్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. హరహర మహదేవ్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ స్థానిక అధికారులను ఆయనకు పరిచయం చేశారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

భోజ్పురిలో ప్రసంగం..
అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. తొలుత భోజ్పురిలో క్లుప్తంగా మాట్లాడారు. పురాణాలు, చరిత్రలో వారణాశికి ఉన్న ప్రాముఖ్యతను వర్ణించడానికి మాటలు చాలవని అన్నారు. ఛత్రపతి శివాజీ మొదలుకుని ఝాన్సీ లక్ష్మీబాయి దాకా, మున్షీ ప్రేమ్చంద్ మొదలుకుని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వరకూ ఎందరో చరిత్రకారులతో ఈ నగరం ముడిపడి ఉందని పేర్కొన్నారు.

నమామి గంగే ప్రాజెక్ట్..
శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న కాశీ నగరం.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. పరదేశీయులు కాశీని కొల్లగొట్టడానికి వచ్చిన ప్రతీసారీ ఓ మహా వీరుడు ఉద్భవించాడని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా.. నమామి గంగేకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని మోడీ గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో గంగానదీ ప్రక్షాళనను చేపట్టామని పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధి అనంతం అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications