జరభద్రం: ఫోన్ వచ్చిందని వెళ్లిన డాక్టర్.. తీరా వెళితే బట్టలు విప్పమన్నారు ఆ తర్వాత..!
సొంతంగా క్లినిక్ను నడుపుతున్న డాక్టర్లు జరభద్రం. ఎప్పుడైనా ఎవరినుంచైనా సరే జబ్బు చేసింది వెంటనే ఇంటికి వచ్చి చూడాలని ఫోన్ వస్తే జాగ్రత్తతో వ్యవహరించండి. జాగ్రత్తగా ఉండకపోతే హూష్ ఫటాక్ అవుతారు. జేబులకు చిల్లు పడుతుంది.. మళ్లీ అదే ఫోన్ నుంచి కాల్స్ వస్తాయి.. మళ్లీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. ఇందుకు నిదర్శనం కోల్కతాలో జరిగిన ఘటనే.

మహిళ నుంచి డాక్టరుకు ఫోన్
కోల్కతా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారో తెలుసా...? ఈ నలుగురు కలిసి అక్కడే ఓ క్లినిక్ నడుపుకునే డాక్టరును మాయచేసి బ్లాక్మెయిలింగ్ చేశారు. అసలు డాక్టరును బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముందనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. డండం ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ అక్కడే డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తున్న ఓ కశ్మీరీ డాక్టరుకు ఫోన్ చేసి గుండె నొప్పిగా ఉందని చెప్పింది. తన ఇంటికి వెంటనే రావాల్సిందిగా కోరింది. దేవుడి తర్వాత ప్రాణాలు కాపాడేది వైద్యుడే. ఫోన్ రాగానే పాపం ఆ డాక్టరు మహిళ చెప్పిన అడ్రస్కు పరుగులు తీశాడు.

వెనకాల నుంచి పోలీస్ గెటప్తో నలుగురు ఎంట్రీ
ఇక ఇంటికి చేరుకోగానే ఆమెకు సంబంధించిన పాత ప్రిస్క్రిప్షన్స్ చూస్తుండగా వెనకాల నుంచి నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ వచ్చారు. అంతే అక్కడ ఏదో జరుగుతోందన్న విషయం డాక్టర్కు అర్థమైంది. ముందుగా హనీ ట్రాప్ చేశారా అనే అనుమానం డాక్టర్లో నెలకొంది. అయితే తాము పోలీసులమని ఇక్కడ ఈ మహిళతో ఏం చేస్తున్నావని గట్టిగా ప్రశ్నించారు. అయితే తనకు ఫోన్ రావడంతోనే చికిత్స చేసేందుకు ఇంటికి వచ్చినట్లు డాక్టర్ చెప్పాడు. ఇది నమ్మ శక్యంగా లేదని చెప్పిన ఆ డూప్లికేట్ పోలీసులు డాక్టర్ వేసుకున్న బట్టలను విప్పేసి నగ్నంగా ఉంచారు. అనంతరం ఫోటోలు తీసుకున్నారు.

బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డ దుండగులు
ఇక తాము పోలీసులం కాదన్న సంగతి చెప్పి రూ. 10 లక్షలు ఇస్తావా లేక ఫోటోలను ఇంటర్నెట్లో పెట్టమంటావా అని బెదిరించారు. బెదిరిపోయిన డాక్టరు ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న రూ.5,15,000 ఇవ్వడమే కాదు ... రూ.5 లక్షలు విలువ చేసే తన భార్య నగలను కూడా వారి చేతిలో పెట్టాడు. ఆ డబ్బులు నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు దుండగులు. ఇక షాక్ నుంచి తేరుకున్న డాక్టర్ జరిగిన విషయం గురించి పోలీసులకు తెలిపాడు.

పోలీసుల రంగప్రవేశం.. నలుగురు అరెస్టు
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అనంతరం ఫేక్ కాల్ చేసిన మహిళ, మరో వ్యక్తి సిటీ కోర్టులో లొంగిపోయారు. ఇక నిందితుల్లో ఒకరింటి నుంచి పోలీసు యూనిఫాంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నలుగురికి బెయిల్ మంజూరు అయ్యిందని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications