కశ్మీర్ నుంచి మళ్లీ వలసపోతున్న పండిట్లు-వరుస హత్యలతో బెంబేలు
కశ్మీర్లో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను మూడు ముక్కలు చేసి అక్కడ శాంతి నెలకొల్పుతున్నట్లు చెప్పుకున్న కేంద్రం ఇప్పుడు హిందువుల హత్యల్ని సైతం అడ్డుకోలేకపోతోంది. దీంతో కశ్మీర్ పండిట్లు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్దమవుతున్నారు.
కశ్మీరీ పండిట్ల పునరావాస డిమాండ్ను కేంద్రం తిరస్కరించినప్పటికీ భయాందోళనలకు గురైన వందలాది మంది నిన్న లోయ నుంచి హిందూ మెజారిటీ జమ్మూ జిల్లాకు బయలుదేరారు. ప్రముఖ పండిట్ల సంఘం కాశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (KPSS), J&K చీఫ్ జస్టిస్కి ఒక బహిరంగ లేఖలో భయపడుతున్న పండిట్లను లోయను విడిచి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరింది.
దక్షిణ కాశ్మీర్లోని మట్టన్, వెస్సు, శ్రీనగర్లోని షేక్పోరా, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, కుప్వారాలోని పండిట్ ట్రాన్సిట్ కాలనీల నుండి పండిట్ ఉద్యోగులు, వారి కుటుంబాలను తీసుకుని వేలాది వాహనాలు ఉదయాన్నే లోయ నుండి బయలుదేరాయి. అనంత్నాగ్లోని మట్టన్ ట్రాన్సిట్ కాలనీలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లు జూన్ 1 నుండి 80 శాతానికి పైగా కుటుంబాలు జమ్మూకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమకు ఉత్తుత్తి హామీలు ఇస్తున్నాయని వారు తెలిపారు. ఇటీవలి హత్యల తర్వాత తాము సురక్షితంగా లేమని వారు చెప్తున్నారు. ప్రస్తుతం మట్టన్ కాలనీలో నివాసముంటున్న 96 కుటుంబాల్లో కేవలం డజను కుటుంబాలు మాత్రమే మిగిలాయి. రాబోయే రోజుల్లో వాళ్లు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతారని మరో పండిట్ ఉద్యోగి తెలిపారు.
తాజాగా ఉగ్రవాదులు ఓ టీచర్ ను, బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపడంతో కశ్మీరీ పండిట్లలో భయాందోళనలు నెలకొంటున్నాయి. కేంద్రం మాత్రం ఈ దాడుల్ని అరికట్టలేక చోద్యం చూస్తోంది. దీంతో చేసేది లేక పండిట్లు లోయను విడిచి జమ్మూకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.