26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి
ముంబై: నవంబర్ 26, 2008లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద నిరోధక బృందం చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే మృతి చెందారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
హఠాత్తుగా కిందపడి కోమాలోకి వెళ్లిపోవడంతో కవితను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. కాగా, ఆమె తన మరణానికి ముందే తన దేహాన్ని పరిశోధన కోసం డొనేట్ చేశారు.
ఉద్రవాదుల దాడిలో సరైన ఆయుధాలు లేని కారణంగానే తన భర్తతో పాటులు పలువురు పోలీసు ఉన్నతాధికారులు చనిపోయారని ఆమె గతంలో ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలను, సరైన శిక్షణను, వసతులను కల్పించాలని కవితా కర్కరే డిమాండ్ చేశారు.
2008, నవంబర్ 26న ముంబైలోని కామా ఆస్పత్రి వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో హేమంత్ కర్కరేతోపాటు అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలస్కర్ మృతి చెందారు.