సుప్రీంకు కావూరి, అసద్: రేపే రాజ్యసభకని కమల్నాథ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) రాజ్యాంగ వ్యతిరేకమని, దానిపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు అన్నారు. సుప్రీం కోర్టు దీనిని కొట్టి పడేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టుకు అసద్
విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్కు కట్టబెట్టడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
సభలో అద్వానీపై జైపాల్ రెడ్డి
తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం లోకసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్వానీ తెలంగాణ ముసాయిదా బిల్లును తప్పు పట్టడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
సుష్మ ప్రసంగం... లేని అద్వానీ
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ మంగళవారం బిల్లు పైన లోకసభలో మాట్లాడుతున్న సమయంలో ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సభలో లేరు.
అమరుల త్యాగఫలితం: విజయశాంతి
అమరవీరుల త్యాగఫలితం వల్ల తెలంగాణ సాధ్యమైందని మెదక్ ఎంపి విజయశాంతి అన్నారు. తెలంగాణ కల సాకారం కావడానికి కారణమైన బిజెపి, కాంగ్రెసు పార్టీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు అద్భుతమైన రోజని, మరువలేని రోజని, 50 ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పారు. బిల్లు సభలో ప్రవేశించకుండా సీమాంధ్ర నేతలు ఎన్నో ఎత్తులు వేశారని కానీ, చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు.
ఈ ఐదేళ్లలో తాను, కెసిఆర్ పార్లమెంటులో ఎంతో హుందాగా వ్యవహరించామని సీమాంధ్ర నేతలు మాత్రం చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. సోనియాని ఎంతోమంది ఎన్నో విధాలుగా తిట్టినా, ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని కొనియాడారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయ్యుండాలని, అవినీతి మచ్చ లేనివారయ్యుండాలని చెప్పారు. ఈ విజయం అమరవీరులకు అంకితమని చెప్పారు.
విజయశాంతి నోట్లో ఎర్రబెల్లి స్వీటు
పార్లమెంటు ఆవరణలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయశాంతికి మిఠాయి తినిపించారు. మీడియా ఉన్నచోట వారు కలుసుకున్నారు.
ప్రజలు చూడకుండానా: ములాయం
లోకసభ సమావేశాలను ప్రజలు చూడకుండా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడమేమిటని ములాయంసింగ్ యాదవ్ అన్నారు. సభ జరిగే తీరు ఇది కాదన్నారు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు కలిసి దుర్మార్గంగా వ్యవహరించాయన్నారు.
లైవ్ ప్రసారాలపై...
లోకసభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెసు స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగానే లైవ్ ప్రసారం ఆగిపోయిందన్నారు. కేంద్రమంత్రులు షిండే, సల్మాన్ ఖుర్షీద్లు మాట్లాడుతూ ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోవడం సర్వసాధారణం అన్నారు. సాంకేతిక సమస్య కారణంగానే నిలిచిపోయాయని చెప్పారు. ఖుర్షీద్ మాత్రం ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాలని ఎవరు ఆదేశించారని తృణమూల్ కాంగ్రెసు ప్రశ్నించింది.
బిజెపిపై కమల్ నాథ్
తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే రాజ్యసభకు తీసుకొస్తామన్నారు. లోకసభలో విభజన బిల్లుకు మొత్తం 38 సవరణలు ఆమోదం పొందాయని తెలిపారు.
సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: షిండే
తెలంగాణపై ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని షిండే చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తమ కర్తవ్యం అన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించామన్నారు.