కలిసిన సిఎంలు: కెసిఆర్ జోక్లకు బాబు నవ్వు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు రెండోసారి కలుసుకున్నారు. వారిద్దరు మళ్ళీ ఒకే వేదికపై కనిపించారు. 68వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాజ్భవన్లో శుక్రవారం ఇచ్చిన ఎట్ హోం తేనేటి విందుకు ఇద్దరు సీఎంలు హాజరయ్యారు.
ఇరువురు ముఖ్యమంత్రులకు గవర్నర్ నరసింహన్ అనుసంధాన కర్తగా కనిపించారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినప్పుడు విమానాశ్రయంలో చంద్రబాబు, కెసిఆర్ ఒకే చోట కలిశారు. సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇదే.
రాజభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అప్యాయంగా పలకరించుకున్నారు. కెసిఆర్ సరదాగా వేసిన జోకులకు చంద్రబాబు నవ్వారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో గవర్నర్ సరదాగా సంభాషణలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సిపిఎం నేత మధు, పలువురు నేతలు హాజరయ్యారు.
రెండు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, కాంగ్రెసు నేతలు డి. శ్రీనివాస్, వి హనుమంతరావు, బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ, హైదరాబాద్ మేయర్ మాజీద్ కూడా విందుకు హాజరయ్యారు.