పరిశీలన: బాబుతో పోటీ, 'హీరో'ని దువ్వుతున్న కేసీఆర్!
హైదరాబాద్: దక్షిణాదిలో ద్విచక్ర వాహన తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న హీరో మోటో కార్ప్ ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. బుధవారం కంపెనీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం మెదక్ జిల్లాలోని జహీరాబాద్తోపాటు ఔటర్ రింగు రోడ్డు చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలను సందర్శించింది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని దాదాపు ఆరు ప్రాంతాలను సందర్శించారు.
ఏ ప్రాంతం అయితే తమ యూనిట్ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది, ఆయా ప్రాంతాల్లో నీటి వనరుల లభ్యత, విద్యుత్ సరఫరాకు ఉన్న అవకాశాలు వంటి అంశాలను కంపెనీ బృందం పరిశీలించింది. ప్రతిపాదిత ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించిన తర్వాత కంపెనీ ప్రతినిధులు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కత్తి ప్రదీప్ చంద్రతో కూడా భేటీ అయ్యారు.
అంతా అనుకూలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో యూనిట్ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు కంపెనీ సానుకూలంగా ఉన్నందునే స్థలాల పరిశీలనకు బృందాన్ని పంపిందని సర్కారు భావిస్తోంది.
ద్విచక్ర వాహనాల మార్కెట్లో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉండటంతో కంపెనీ కొత్త యూనిట్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవకాశాలు గణనీయంగా పెరగటంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఏ కంపెనీకి ఇవ్వని రీతిలో హీరోకు అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చి అయినా సరే ఈ ప్రాజెక్టును దక్కించుకోవాలనే యోచనలో సర్కారు ఉంది. హీరో కోసం ఏపీ ప్రభుత్వం కూడా పోటీ పడుతోంది.
మరోవైపు, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రూ.2500 కోట్లతో ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని ఆస్ట్రేలియాకు చెందిన ఎన్ఎస్ఎల్ కన్సాలిడేట్ సంస్థ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రతిపాదనలు సమర్పించింది. మొదటి దశలో రెండు జిల్లాల్లో ఇనుప ఖనిజం గుళికల తయారీ పరిశ్రమలను స్థాపిస్తామని, ఆ తర్వాత 18 నెలల్లో కరీంనగర్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని తెలిపింది.