మోడీకి కేసీఆర్ లేఖ: ఎన్టీఆర్, పీవీలపై ఏపీ తీర్మానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఓబీసీలు, మహిళలకు రిజర్వేషన్ల పైన ఈ లేఖలో ప్రస్తావించారు. ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ తన లేఖలో కోరారు.
ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పైన తెలంగాణ చట్ట సభలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలిలు ఇందుకోసం తీర్మానం చేశాయన్నారు. ఈబీసీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. వీటి కోసం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీ కేబినెట్లో మూడు తీర్మానాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 4 గంటలపాటు ఈ భేటీ జరిగింది. జన్మభూమి - మా ఊరు, రుణ మాఫీపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మూడు తీర్మానాలకు ఆమోద ముద్ర వేశారు. పలు తీర్మానాలు, నిర్ణయాలు చేశారు. రైతు సాధికారిక కార్పొరేషన్ ఏర్పాటు, ఉద్యోగులకు సుమారు 6 శాతం డీఏ పెంపు, పారిశుధ్ధ్య కార్పొరేస్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రుణమాఫీ కింద తొలి విడతగా 20 శాతం నిధులను రైతు కార్పొరేషన్కు కేటాయించాలని, కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ రుణాలు చెల్లించాలని, జన్మభూమిని పండుగగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను జన్మభూమి కార్యక్రమంలో ప్రజలకు వివరించాలని చంద్రబాబు మంత్రులకు, అధికారులకు సూచించారు. సన్న, చిన్నకారు రైతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రుణ మాఫీ అని కాకుండా రైతుకు ఆర్థిక సాయం పథకం అమలుగా చేయాలని నిర్ణయించారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు ఢిల్లీలోని ఘాట్ నిర్మించాలని, అమెరికా పర్యటన విజయవంతంపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ ఏపీ కేబినేట్ తీర్మానాలు చేసింది. ఎర్రచందనం అమ్మకాలపై స్టే ఎత్తివేయడం శుభపరిణామమని, ట్యాంక్బండ్పై ఆంధ్రా వారి విగ్రహాలు తొలగింపు సరికాదని కేబినెట్ అభిప్రాయపడింది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను విజయవాడలో పెట్టలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు ఇసుక రిచ్లను అప్పగించే విషయం గురువారం నుంచే అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది తెలంగాణ ప్రాంతంలో చదివే ఆంధ్రా విద్యార్థులకు, ఆంధ్రాలో చదివే తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశ నిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications