బీజేపీకి ముందే తెలుసు: మమతా, కేజ్రీవాల్
కోల్ కత్తా: రూ.1,000. రూ.500 నోట్లు రద్దు చెయ్యడంతో సామాన్య ప్రజలు, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల ముందు క్యూలో బారులు తీరారు. ఈ పెద్ద నోట్ల రద్దును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
సామాన్య ప్రజలను ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి నల్లధనం తీసుకురావడంలో, వాటిని అరికట్టడానికి ప్రయత్నించడంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సామాన్య ప్రజలు తమ బాధలు, కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ నాటకంలో ఓ భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పెద్ద నోట్లు రద్దు అవుతాయని ముందే తెలుసు, వారి బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకుని ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్దారు.

బీజేపీ నాయకులు వారి అన్ని సమస్యలు తీర్చుకున్నాకా, వారి నల్లధనం మొత్తం మార్చుకున్న తరువాత ఏదో కొత్తగా తీసుకున్న నిర్ణయం అని అందరిని మెప్పించడానికి ఇలా ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ నేతలకు రూ.1,000. రూ.500 నోట్లు రద్దు అవుతున్నాయని ముందే తెలుసు అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనకు ముందే బీజేపీ నాయకుల వ్యవహారం చూస్తుంటే ఆ అనుమానాలకు అసలు నిజం తెలుస్తుందని అంటున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనకు కొద్ది గంటల ముందే రూ.మూడు కోట్లు డిపాజిట్ చేసిందని అంటున్నారు. అందుకు సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా ఆ బ్యాంకు డాక్యుమెంట్లను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications