మోడీvsకేజ్రీవాల్: రాహుల్ గాంధీ సైడ్, కాంగ్రెస్ సేఫా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) ప్రభావం కాంగ్రెసు పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ పైనే ఎక్కువగా ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న బిజెపికి కేజ్రీవాల్ భయం లేకపోలేదంటున్నారు. అందుకు ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమని చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ లేకుంటే బిజెపి కచ్చితంగా గెలిచి ఉండేదని అందరూ చెబుతున్నారు.
పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న షీలా దీక్షిత్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి అత్యాచారాలు, కామన్వెల్తు క్రీడల అవినీతి అంశాలు ప్రజల అసంతృప్తికి బాగా తోడయ్యాయి. దీంతో ఈసారి గెలుపు బిజెపిదేనని అందరూ భావించారు. అయితే కేజ్రీవాల్ కారణంగా కాంగ్రెసు వ్యతిరేక ఓటు చీలి అధికారానికి మూడు సీట్ల దూరంలో బిజెపి నిలవగా, ఏ ప్రభుత్వం పైన అయితే పోరాడిందో అదే ప్రభుత్వం సహకారంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది.
కాంగ్రెసు పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లోను మంచి పట్టు ఉంది. బిజెపి మాత్రం ఆ స్థాయికి ఇంకా పూర్తిగా చొచ్చుకు పోలేదు. నగరాలు, పట్టణాలే బిజెపి బలం! ఇప్పుడు కేజ్రీవాల్ హవా కూడా అక్కడే కొనసాగుతోంది. ఇది బిజెపికి మింగుడు పడని విషయమే అంటున్నారు. 2014 లోకసభ ఎన్నికల్లో పలు నగరాల నుండి పోటీ చేసేందుకు ఎఎపి సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని నగరాల్లో ఎఎపి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎఎపి పోటీ చేసే చోట కాంగ్రెసు వర్సెస్ బిజెపిల కంటే కేజ్రీవాల్ వర్సెస్ కేజ్రీవాల్ మధ్యనే పోటా పోటీ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రభావితం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మోడీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటర్నెట్ను కూడా వినియోగించుకుంటున్నారు. మోడీకి ఇప్పుడు ధీటుగా కేజ్రీవాల్ కూడా ప్రచారం చేస్తున్నారు.
కేజ్రీవాల్ కారణంగా కాంగ్రెసు పార్టీకి నష్టం జరిగినా, జరగకపోయినా.. బిజెపి మాత్రం ఢిల్లీ పీఠం ఎక్కడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెసు పాలన వైఫల్యంపై ఢిల్లీ కేంద్రంగా అన్నా హజారే ఉద్యమం దాదాపు మూడేళ్లుగా నడుస్తోందని, ఆ ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభావం చూపగలిగారని, అన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించదని, ఒకవేళ కనిపించినా ప్రభుత్వం వ్యతిరేక ఓటు కొంత చీలినా అధికారం మాత్రమే తమదేనని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కాంగ్రెసు పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వ్యతిరేక ఓటు కొంత చీలినా ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు.
మరోవైపు కాంగ్రెసు మద్దతుతో ఢిల్లీ పీఠమెక్తుతున్న ఎఎపిపై విమర్శలు వినిపిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోందంటున్నారు. 'ఆప్' తన అజెండాను మొండిగా అమలు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే 'చూడండి, మమ్మల్ని బలిపశువును చేశారు' అంటూ ప్రజల్లో సానుభూతి పొందే వ్యూహానికి తెరలేపిందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.