మోడీ హామీ ఇస్తే బిజెపిలో చేరుతా!: కేజ్రీవాల్, ఖండన
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హామీ ఇస్తే తాను బిజెపిలో చేరుతానని ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతలోనే ఆయన మాట మార్చారు. తాను బిజెపిలో చేరుతానని చెప్పలేదని, తాను చనిపోయే వరకు బిజెపి, కాంగ్రెసు పార్టీలలో కలిసేది లేదని ఆ తర్వాత చెప్పారు.
నరేంద్ర మోడీని వారణాసిలో ఓడించడమే తన లక్ష్యమని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మోడీని ఓడించడానికే వారణాసి బరిలో దిగానని స్పష్టం చేశారు. తనతో పాటు అమేథీలో రాహుల్ గాంధీపై ఎఎపి అభ్యర్థి కుమార్ విశ్వాస్ కూడా విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీగా నెగ్గి పార్లమెంట్కు వెళ్లడం కోసం తాము సురక్షిత స్థానాలను ఎంచుకోలేదని, మోడీ, రాహుల్ను ఓడించాలనే వారితో పోటీకి సై అంటున్నామన్నారు. గ్యాస్ ధరలను పెంచకూడదని మోడీ నిర్ణయిస్తే తాను బిజెపిలో చేరతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపిలపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి పారిపోయానంటూ వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తానేమీ పాకిస్థాన్కు పారిపోలేదని, అయినా ముఖ్యమంత్రి పీఠం వదలాలంటే గుండె ధైర్యం కావాలని, అది తనకుందన్నారు. పార్లమెంటుకు వెళ్లాలను కుంటే సులభంగా గెలిచే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పోటీ చేసి ఉండేవాడినన్నారు.












Click it and Unblock the Notifications