శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల బస్సుకు పెను ప్రమాదం
తిరువనంతపురం: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్తోన్న భక్తులతో బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 60 మంది భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కేరళలోని పథనంథిట్ట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి 60 మంది భక్తులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడు నుంచి శబరిమలకు బయలుదేరింది. మార్గమధ్యలో పథనంథిట్ట జిల్లాలోని నీలక్కల్కు మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కనే లోయలో పడింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ- భక్తులందరూ గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. లోయలో పడిన బస్సులో నుంచి భక్తులను వెలికి తీశారు. డ్రైవర్ సహా 60 మంది భక్తులు గాయపడ్డారని పథనంథిట్ట జిల్లా పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ వారిని నీలక్కల్లోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పథనంథిట్టలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు ఉన్నట్లు పోలీసులు వివరించారు.
ఈ ఘటన పట్ల కేరళ రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. సంఘటన స్థలానికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. బస్సు ప్రమాదంపై ఆరా తీశారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది నవంబర్ లో ఇదే నీలక్కల్ ప్రాంతంలో ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తుల బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి ఘటనలో 20 మంది భక్తులు గాయపడ్డారు. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది.












Click it and Unblock the Notifications