కేరళ నన్స్పై రైల్లో వేధింపులు: భజరంగ్ దళ్.. రైల్వే పోలీసులు: అమిత్ షానకు పినరయి లేఖ
తిరువనంతపురం: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తోన్న నలుగురు కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు వేధింపులకు గురి చేశారు. బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారనే కారణంతో వారిని నిర్బంధించారు. రైల్వే పోలీసులు కూడా భజరంగ్ దళ్ కార్యకర్తలకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో మహిళా కానిస్టేబుళ్ల సంఘటనా స్థలంలో లేరని తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఒడిశాలోని రూర్కేలా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ నలుగురు క్రైస్తవ సన్యాసినులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఇతర ధృవీకరణ పత్రాలను అందజేసినప్పటికీ.. రైల్వే పోలీసులు పట్టించుకోలేదని, వారిని బలవంతంగా రైలు నుంచి కిందికి దించి వేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూర్కేలాలో ఏర్పాటైన శాక్ర్డ్ హార్ట్స్ కంగ్రెగేషన్కు హాజరవుతున్నారని, తమవెంట పోస్టులాంట్స్ను తీసుకెళ్తున్నారనేది రైల్వే పోలీసుల వాదన. ఝాన్సీ రైల్వే స్టేషన్లో నిర్బంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే 150 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు క్రైస్తవ సన్యాసినులను వేధింపులకు గురి చేశారు.
దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని అన్నారు. రైల్వే పోలీసులతో పాటు, భజరంగ్ దళ్ కార్యకర్తలపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు లేఖ రాశారు. ఆధార్ కార్డులను చూపించినప్పటికీ.. అవి నకిలీవని పోలీసులు ఎలా నిర్ధారించగలరని ప్రశ్నించారు. తమ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ సన్యాసినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని, వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో మహిళా కానిస్టేబుళ్లు కూడా లేరని అన్నారు.