కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే..లెజెండరీ లీడర్ కన్నుమూత
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే.. కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కేరళ కాంగ్రెస్ (బీ) ఛైర్మన్ ఆర్ బాలకృష్ణ పిళ్లై కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారు జామున కొట్టారక్కారలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలువురు ముఖ్యమంత్రుల కేబినెట్లో పనిచేశారు. కాంగ్రెస్ వైఖరి నచ్చక బయటికి వచ్చిన బాలకృష్ణ పిళ్లై.. కేరళ కాంగ్రెస్ (బీ) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.
ఆయనకు ముగ్గురు కుమారులు. పథనపురం నుంచి కేరళ కాంగ్రెస్ (బీ) అభ్యర్థిగా విజయం సాధించిన ప్రముఖ మలయాళ నటుడు కేబీ గణేష్ కుమార్ ఆయన కొడుకే. విద్యార్థిదశలోనే బాలకృష్ణ పిళ్లై రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేశారు. క్రమంగా ఎదిగారు. ఏఐసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 25 ఏళ్ల వయస్సులోనే పథనంపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. కేరళ కాంగ్రెస్ (బీ) పేరుతో ప్రత్యేక పార్టీని స్థాపించారు. సీ అచ్యుత మీనన్, కే కరుణాకరన్, ఈకే నయనార్, ఏకే ఆంటొనీ ప్రభుత్వాల్లో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. పలు శాఖలను ఆయన పర్యవేక్షించారు.
బాలకృష్ణ పిళ్లై మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కడగంపల్లి సురేంద్రన్, కేకే శైలజ, థామస్ ఇసాక్, యూడీఎఫ్ నేతలు రమేష్ చెన్నితల, ఊమెన్ చాందీ వంటి నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన కేరళ కాంగ్రెస్ (బీ) శాసన సభ్యుడు కేబీ గణేష్ కుమార్కు ఫోన్ చేసి, పరామర్శిస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.