నిజమైన హీరోలు వీరే: కేరళలో హృదయాలను గెలిచిన ఇండియన్ ఆర్మీ(వీడియో)
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రంలో దాదాపు 357 మంది ప్రాణాలు కాల్పోయారు. రాష్ట్రంలోని 14జిల్లాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది సహాయక శిబిరాలకు తరలించారు.
కాగా, ఎన్డీఆర్ఎఫ్, భారత సైన్యం, నావికా దళం, వాయుసేనలు కేరళ వరదల సమయంలో అమూల్యమైన సేవలందించాయి. వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడాయి.
ఓ బాలుడిని కాపాడేందుకు సైనికుడు తాడు సాయంతో ఒంటి చేత్తో హెలికాప్టర్పైకి వెళ్లడం, ఓ పైలట్ చాకచక్యంతో గర్భిణీని కాపాడటం లాంటి చాలా వీడియోలు ఇప్పటికే వైలర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో కూడా వైరల్గా మారింది.
వరదలో చిక్కుకున్న ఓ దివ్యాంగుడిని(ప్రోస్థెటిక్ అవయవం ధరించిన వ్యక్తి) సైనికులు జాగ్రత్తగా కాపాడారు. ఓ అపార్ట్మెంట్లో చుట్టూ నీరు ఉంది. ఆ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఆ దివ్యాంగుడు చిక్కుకుపోయాడు. దీన్ని గమనించిన ఐదుగురు సైనికులు అతని కోసం పడవలో అక్కడికి వెళ్లి నిచ్చెన సాయంతో జాగ్రత్తగా కిందికి దించి రక్షించారు.
ఇదంతా వీడియో తీసి తమ అధికారిక ఇన్స్టాగ్రామ్లో 'ఎక్కడవున్నా మేం మిమ్మల్ని రక్షిస్తాం' అంటూ పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఓపికతో దివ్యాంగుడిని కాపాడిన సైన్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. మీ సేవలు మరువలేమంటూ కొనియాడుతున్నారు. మీరే మాకు నిజమైన హీరోలు అంటూ ప్రశంసించారు.