కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: టాప్ ఐఏఎస్పై సస్పెన్షన్ వేటు.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్..
ఇండియాతోపాటు గల్ఫ్ దేశాల్లోనూ సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు, అనుమానితుల్ని ఒక్కొక్కరుగా విచారిస్తోన్న ఎన్ఐఏ.. ఆధారాలను సేకరించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు ప్రభుత్వ పరంగానూ ఈ అంశానికి సంబంధించి విజయన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..
ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి, ఐటీ శాఖ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం. శివశంకర్ పై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారులుగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ను ఐటీ శాఖలో చేర్చుకోవడం దగ్గర్నుంచి, ఆమెతో ఇతర సంబంధాలను కూడా కలిగి ఉన్నారనే ఆరోపణలపై శివశంకర్ ను గత వారం బదిలీ చేశారు. బుధవారం ఎన్ఐఏ ఆయనను 9 గంటలపాటు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ.. శివశంకర్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లుగా నిర్ధారించడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయన్ మీడియాకు చెప్పారు. కాగా,
శివశంకర్ పై వేటు వేయడం ద్వారా సీఎం విజయన్ తప్పించుకోవాలని చూస్తున్నారని, గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎంకు, సీఎంవోకు నేరుగా సంబంధాలున్నాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. విజయన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం మాత్రం దీన్ని కొట్టిపారేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో నిజానిజాలు తెలతాయని అన్నారు. మరోవైపు..
విజయన్ మంత్రి వర్గ సభ్యుడు, విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ తరచూ స్వప్న సురేశ్ తో ఫోన్లో మాట్లాడినట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఎన్ఐఏ సేకరించిన స్వప్న కాల్ డేటాలో ఈ విషయం బయటపడింది. తాను స్వప్నతో పోన్లో మాట్లాడిన మాట నిజమేనని ఒప్పుకున్న మంత్రి.. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంతో మాత్రం సంబంధం లేదని చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా యూఏఈ కాన్సులేట్ లో కిట్స్ పంపిణీ గురించే స్వప్నతో మాట్లాడినట్లు తెలిపారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటిదాకా 12 మందిని అరెస్టు చేసింది. జులై 5న తిరువనంతపురం ఎయిర్ పోర్టులో డిప్లొమాటిక్ బ్యాగేజీలో 30 కేజీల బంగారం పట్టుపడటంతో ఈ వ్యవహారం గుట్టురట్టైంది.