ఇదీ స్వప్న సురేశ్ సంచలనాల జాబితా.. కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ వేట.. 10th పాస్ కాకుండానే టాప్కు..
స్వప్న సురేశ్.. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. కనీసం పదో తరగతి కూడా పాస్ కాకున్నా.. విదేశాల్లో ఉద్యోగాలు.. రాష్ట్ర ఐటీ శాఖలో కీలక పదవులు.. టాప్ అధికారులతో గాఢమైన పరిచయాలు.. వీవీఐపీలతో వరుస మీటిగ్స్ స్థాయికి ఎదిగి.. చివరికిప్పుడు పరారీలో ఉన్నారు. కేరళ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారి స్వప్న కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈలోపే స్వప్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం సంచలనంగా మారింది..

లుక్ ఔట్ నోటీసులు..
డిప్లొమాటిక్ పాస్ పోర్టులను అడ్డం పెట్టుకుని గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన వ్యవహారంలో స్వప్న సూత్రధారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె.. కేరళ ముఖ్యమంత్రి నిర్వహిస్తోన్న ఐటీ శాఖలో కీలక పదవిలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రకంపనలు రేపింది. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం ఒకేసారి రూ. 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం పట్టుపడటంతో అక్రమాల పుట్ట బద్ధలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్న.. దేశం విడిచి పారిపోకుండా లక్ ఔట్ నోటీసులు జారీచేయనున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. ఇది అంతర్జాతీయ వ్యవహారాలు, దేశభద్రతకు ముడిపడిన అంశం కూడా కావడంతో కేసు దర్యాప్తులో సీబీఐ, ఎన్ఐఏ, రా తదితర సంస్థల సాయం కూడా తీసుకుంటున్నట్లు కస్టమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఆయా సంస్థల అధికారులు బుధవారం ఎర్నాకుళంలో సమావేశమయ్యారు.

తమిళనాట సోదాలు.. బెయిల్ యత్నాలు..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న స్వప్న సురేశ్.. బలరామాపురం మీదుగా తమిళనాడుకు పారిపోయినట్లు తెలుస్తోంది. అక్కడున్న తన కాంటాక్టుల ద్వారా కొచ్చి కోర్టు నుంచి బెయిల్ ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమిళనాడు నుంచి కొందరు లాయర్లు కొచ్చి పయనమైనట్లు వెల్లడైంది. దీంతో కేరళ కస్టమ్స్ అధికారులు.. తమిళనాడులోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే స్వప్న తమిళనాడుకు పారిపోయినట్లు లీకులు వచ్చాయని, ఆమె తిరువనంతపురంలోనే ఎక్కడో దాక్కొని ఉండొచ్చని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు.

పదోతరగతి పాస్ కాలేదట..
స్వప్న సురేశ్ అక్రమాలకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. త్రివేంద్రం శివారు నెయ్యట్టింకరకు చెందిన ఆమె పదో తరగతి కూడా పాస్ కాలేదని సోదరుడు బ్రైట్ సురేష్ తెలిపారు. కుటుంబ ఆస్తి పంపకాల్లో గొడవలు జరిగాయని, ఆ సమయంలో కాళ్లూ, చేతులు నరికేస్తానంటూ స్వప్న బెదిరించిందని, ఆ దెబ్బతో ఇప్పటిదాకా కేరళలో అడుగుపెట్టలేదని బ్రైట్ తెలిపాడు. చాలా ఏళ్ల నుంచి ఆమె బిగ్ షాట్స్ తో పరిచయాలు కలిగి ఉందని, తన కార్యకలాపాలను రహస్యంగా దాచేదని బ్రైట్ చెప్పుకొచ్చాడు.

చిన్నప్పటి నుంచే దుబాయ్..
స్వప్న తల్లి నెయ్యట్టింకరలో ఉంటుండగా, తండ్రి మాత్రం దుబాయ్ లో ఉద్యోగం చేసేవారు. తరచూ తండ్రి దగ్గరికి వెళ్లొస్తుండటంతో ఆమెకు చిన్నప్పటి నుంచే దుబాయ్ కొట్టినపిండి. మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సంపాదించిన ఆమె.. తిరువనంతపురంలోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దుబాయ్ ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ సర్వీసు విభాగంలో పని చేశారు. మళ్లీ ఇండియాకు తిగిరొచ్చి ఓ ఏజెన్సీ తరఫున తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా శాట్స్ విభాగంలో కుదిరారు. మీటూ ఉద్యమం సమయంలో అక్కడి అధికారులు కొందరు సస్పెండ్ అయిపోగా, స్వప్న ఉద్యోగం వదిలేసింది. మగ అధికారులకు అనుకూలంగా తోటి మహిళలపై స్వప్న వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆ తర్వాత మరో ఏజెన్సీ ద్వారా కేరళ ఐటీ శాఖలోకి ఎంటరైన ఆమె.. ఉన్నతాధికారులతో పరిచయాల కారణంగా కీలకమైన ఐటీఇన్ఫ్రా ప్రాజెక్టులో ఆపరేషన్స్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.












Click it and Unblock the Notifications