అనూహ్య ఘటన : ఆ రెండు ఛానళ్ల రిపోర్టర్లు వెళ్లిపోండి-ప్రెస్ మీట్ నుంచి పంపేసిన గవర్నర్
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా ఛానళ్ల ప్రతినిధులపై గతంలో జరిగిన పలు ప్రెస్ మీట్లలో అవమానించడం చూస్తూనే ఉన్నాం. తమతో విభేధించే ఆయా ఛానళ్ల ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగానే ప్రెస్ మీట్లకు వచ్చి తమను టార్గెట్ చేస్తున్నారని అధికారంలో ఉన్న వారు భావిస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే ఏకంగా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ కూడా మీడియాను ఇలాగే ట్రీట్ చేసి బహిష్కరిస్తే.. ఇవాళ కేరళలో అదే జరిగింది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రెస్ మీట్ ఉందంటూ మీడియాకు ఆహ్వానం పలికారు. దీనికి అన్ని శాటిలైట్ మీడియా ఛానళ్లు, వార్తా పత్రికల ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ప్రెస్ మీట్ కు వచ్చిన గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాత్రం రాష్ట్రంలోని రెండు మీడియా ఛానళ్ల ప్రతినిధుల్ని అక్కడి నుంచి పంపేశారు. వారు మీడియా ముసుగులో ఉన్న పార్టీ కార్యకర్తలు అంటూ వారిని ప్రెస్ మీట్ నుంచి బహిష్కరించారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోతేనే తాను మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంతకీ గవర్నర్ ఖాన్ బహిష్కరించిన రెండు ఛానళ్లు ఏవో తెలుసా. ఇందులో ఒకటి అధికార సీపీఎం పార్టీకి చెందిన కైరళి న్యూస్ కాగా, మరో ఛానల్ కేంద్రం భద్రతా కారణాలతో నిషేధం విధించిన మీడియా వన్ ఛానల్. ఈ రెండు ఛానళ్ల రిపోర్టర్లు ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోవాలని గవర్నర్ కోరగానే రాజ్ భవన్ సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కొనసాగింది. అయితే గవర్నర్ ఈ రెండు ఛానళ్లు బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు భావిస్తుండమే ఇందుకు కారణం.