ఎట్టకేలకు కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కు విముక్తి- 28 నెలల తర్వాత జైలు నుంచి బయటకు..
కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ ఎట్టకేలకు యూపీ జైలు నుంచి విడుదలయ్యారు. యూపీలోని హత్రాస్ లో రేప్, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో యోగీ సర్కార్ అరెస్టు చేసిన ఆయన ఇన్నాళ్లూ జైల్లోనే ఉన్నారు. ఆయనపై అభియోగాల్ని కోర్టులు పలుమార్లు తప్పుబట్టాయి. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించినా వెంటనే విడుదల చేయలేదు. ఎట్టకేలకు ఆయనకు విముక్తి లభించింది.

2020 అక్టోబర్ లో యూపీలోని హత్రాస్ లో ఓ దళిత యువతిని రేప్ చేసిన కొందరు, ఆ తర్వాత ఆమెను కుటుంబసభ్యులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా తగులబెట్టారు. దీన్ని కప్పిపుచ్చేందుకు యూపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఢిల్లీలో ఉంటున్న కేరళ జర్నలిస్టు యూనియన్ నేత సిద్ధిక్ కప్పన్ వెంటనే హత్రాస్ కు బయలుదేరారు. దీంతో విషయం తెలిసిన యూపీ పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేశారు. అంతే కాదు ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పలు కేసులు నమోదు చేశారు. ఆయనకు తీవ్రవాదుల నుంచి నిధులు అందుతున్నట్లు ఆరోపించారు. చివరికి ఈ ఆరోపణలేవీ కోర్టుల్లో నిలబడలేదు.
తాజాగా సిద్ధిక్ కప్పన్ కు బెయిల్ లభించడంతో 28 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన యూపీలోని లక్నో జైలు నుంచి విడుదలయ్యారు. తనపై పోలీసులు మోపిన అభియోగాలేవీ నిరూపణ కాలేదని కప్పన్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలిపారు. తనకు అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తనపై అక్రమంగా పెట్టిన కేసుల నుంచి విముక్తి లభించడంపై కప్పన్ సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications