Monsoon Countdown: రుతుపవనాలపై కీలక అప్డేట్-అక్కడ ఎల్లో అలర్ట్స్..!
వడగాల్పులతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) ఇవాళ మరో చల్లనికబురు చెప్పింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్ని టచ్ చేసిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. ఇవి ముందుగా అనుకున్న విధంగానే కేరళను తాకబోతున్నట్లు తెలిపింది. దీంతో రుతుపవనాల రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 26న లేదా అంతకంటే ముందే కేరళను రుతుపవనాలు తాకుతాయి.
నైరుతి రుతుపవనాలు మే 26న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ధృవీకరించింది. దీనికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపినప్పటికీ, రుతుపవనాల రాక అంచనా తేదీకి నాలుగు రోజుల ముందు లేదా తరువాత ఉండవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత దక్షిణ భారతంలోని మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అనంతరం ఉత్తరాదికి కూడా విస్తరిస్తాయి.

వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను మోహరించాలని కోరింది. దీనికి స్పందించి, NDRF కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లో 8 బృందాలను, మొత్తం 30 మంది రక్షకులతో కూడిన దళాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో, IMD కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications