ఎంత కష్టం: కూతురు బాగోగుల కోసం కోట్ల ఆస్తి దానం చేసిన కేరళ దంపతులు
కేరళలో కమలాసన్, సరోజిని అనే వృద్ధ దంపతులకు తీరని కష్టం వచ్చి పడింది. కోట్ల ఆస్తి ఉన్నా... వారిని మాత్రం ఒక బాధ వెంటాడుతోంది. వయస్సు మీద పడేకొద్దీ చివరిరోజుల్లోనైనా ప్రశాంతంగా ఉందామనుకొంటున్న వారిని ఆ కష్టం మనోవేదనకు గురిచేస్తోంది. ఇంతకీ కమలాసన్ దంపతులకు వచ్చిన కష్టమేంటి...? వారెందుకు ఈ వయస్సులో ఇంత మనోవేదనకు గురవుతున్నారు..?
కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని కైలా గ్రామంలో కమలాసన్ సరోజిని అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి కోట్లలో ఆస్తి ఉంది. అయితే వారు చాలా రోజులుగా ఒక విషయంలో బాధపడుతున్నారు. అదే వారి కూతురు ప్రియ విషయం. కూతురు ప్రియ తనకు 12 ఏళ్లు నిండినప్పటి నుంచి మనోవైకల్యంతో బాధపడుతూ ఉంది. ఇక ఆమె వైద్యం కోసం కమలాసన్ ఎంతో ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తమ తదనంతరం వారి కూతురు ప్రియా బాగోగులు ఎవరు చూసుకుంటారనే ప్రశ్న ఈ వృద్ధ దంపతులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ప్రియాకు ఇప్పుడు 38 ఏళ్లు. పోనీ ఆమెను ఏదైనా ప్రైవేట్ సంస్థలో చేరుద్దామా అంటే వాటిని నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. బంధువులను కూడా అడిగి చూశారని చెప్పిన కమలాసన్... వారంతా తమ ఆస్తిపట్ల ఆసక్తి చూపుతున్నారు కానీ ప్రియాను చూసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక వారిని వీరిని బతిమలాడలేక... కమలాసన్ దంపతులు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి తమ ఆస్తిలో భాగమైన రూ.3కోట్లు విరాళంగా ఇచ్చి తమ తదనంతరం ప్రియా బాగోగులు చూసుకోవాలంటూ విన్నవించుకున్నారు. అంతే కాదు ప్రస్తుతం తాము నివాసముంటున్న రెండు అంతస్తుల భవనాన్ని ప్రియాలా బాధపడుతున్న మహిళల కోసం కేటాయించాలని కేరళ ప్రభుత్వానికి సూచించారు. ఆ భవనానికి తమ కూతురు ప్రియా పేరు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కోజికోడ్ జిల్లాలోని కొల్లాంలో రూ.3.5 కోట్ల విలువ చేసే ఆస్తిని జూన్ 8న ప్రభుత్వానికి అప్పగించారు. తమ చివరి శ్వాస వరకు ప్రియాను తామే చూసుకుంటామని చెప్పిన కమలాసన్ దంపతులు... ఆ తర్వాత ప్రియా ఎవరి దగ్గర ఉండాలని ఇష్టపడితే అక్కడికి వెళ్లొచ్చంటూ చెప్పారు. అంతేకాదు ప్రియాకు తమ పెన్షన్ డబ్బులు కూడా వస్తాయని చెప్పారు. అయితే ఇది కేవలం ప్రియా కోసం తాము చేస్తున్నది కాదని... తమ కూతురిలా చాలామంది మహిళలు ఇలా బాధపడుతున్నారని వారందరి కోసమే తన ఇళ్లును ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రియాకు తాము ఆర్థికంగా అండగా ఉన్నామని.. కొందరి మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు.
కమలాసన్ దంపతులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటుకు తమ ఆస్తి డాక్యుమెంట్లు అందజేశారు. కమలాసన్ దంపతుల కోరిక మేరకు వారి తదనంతరం ప్రియా బాగోగులు,బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సోషల్ వెల్ఫేర్ శాఖ భరోసా ఇవ్వడంతో ఆ వృద్ధ దంపతులకు ఊరట లభించింది. ప్రస్తుతం ప్రభుత్వం కంటే మరే ఇతర సంస్థలు తమ కూతురు బాగోగులు చూడవని చెప్పిన కమలాసన్ దంపతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications