కుల గోడ: కేరళ కవి శ్రీకుమార్పై దాడి, ఆరుగురి అరెస్టు
కొల్లాం: ప్రముఖ మలయాళీ కవి కురీపుళ శ్రీకుమార్పై మితవాద వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. కేరళలోని కొల్లాంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.
అరెస్టయినవారిలో ఒకతను స్థానిక బిజెపి నాయకత్వంలోని పంచాయతీ సభ్యుడు. ఓ సభకు ముఖ్య అతిథిగా శ్రీకుమార్ హాజరయ్యారు. తన ప్రసంగాన్ని ముగించి, సభ ముగిసిన తర్వాత వెళ్లిపోతుండగా ఆయనపై దాడి జరిగింది.
అతన్ని చుట్టుముట్టి ఆందోళనకారులు బెదిరించారు, దూషించారు. దాంతో ఆయనకు చుట్టూ ఓ వలయం ఏర్పడి ఆయనను వారి నుంచి రక్షించారు. అలా చేయకపోయి ఉంటే తనపై భౌతిక దాడి చేసి ఉండేవారని శ్రీకుమార్ అన్నారు. అయితే, తానేమీ భయపడడం లేదని అన్నారు.
శ్రీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఉదయం ఆరుగురిని అరెస్టు చేశారు. సభలో శ్రీకుమార్ ప్రసంగంపై ఆగ్రహంతో వారు ఈ దాడి చేసినట్లు చెబుతున్నారు.
ఓ స్థానిక ఆలయానికి ప్రహరీ గడ నిర్మిస్తున్న విషయంలో దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య జరిగిన ఘర్షణను శ్రీకుమార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దాన్ని దళితులు కులగోడగా అభివర్ణిస్తున్నారు. కింది కులాల వాళ్లు ప్రవేశించకుండా ఉండడానికే ఆ గోడ కడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
నిరసన తెలియజేయడానికి ఆందోళనకారులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, వాళ్లు సభ జరుగుతున్న ప్రాంతంలో గుమికూడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దళిత వ్యతిరేక నినాదాలు చేశారని శ్రీకుమార్ తన ప్రసంగంలో చెప్పారు.