నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ : మళ్లీ టాప్లో కేరళ- అట్టడుగున బీహార్, జార్ఖండ్
ప్రతీ ఏటా నీతి ఆయోగ్ ప్రకటించే సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సామాజిక, ఆర్ధిక, పర్యావరణ అభివృద్ధి, పురోగతి ఎలా ఉందో చూపిస్తుంటుంది. దీంతో ఇందులో మెరుగైన స్దానం కోసం రాష్ట్రాలు పోటీపడుతుంటాయి. తాజాగా 2020-21 సంవత్సరానికి నీతిఆయోగ్ ప్రకటించిన సూచీ ర్యాంకుల్లో కేరళ మరోసారి అగ్రస్ధానంలో నిలిచింది. బీహార్కు ఎప్పటిలాగే చివరి స్ధానం దక్కింది.
నీతి ఆయోగ్ ఈసారి ప్రకటించిన ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ ర్యాంకుల్లో కేరళ 75 పాయింట్లతో మరోసారి అగ్రస్ధానం నిలబెట్టుకుంది. 74 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు వరుసగా రెండు, మూడు స్ధానాలు దక్కించుకున్నాయి. ఈసారి ర్యాంకుల్లో బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు చెత్త ప్రదర్శనతో అట్టడుగున నిలిచాయి. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెంచేందుకు మూడేళ్లుగా నీతి ఆయోగ్ ఈ సూచీ ర్యాంకుల్ని విడుదల చేస్తోంది. తాజా ర్యాంకుల్ని నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు
2018 డిసెంబర్లో నీతిఆయోగ్ తొలిసారి ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల సమీకృతాభివృద్ధి లక్ష్యాల్ని సమీక్షించేందుకు ప్రాధమికంగా ఈ ర్యాంకులు ఉపయోగపడుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించేందుకు ఆయా రాష్ట్రాలకు ఈ సూచీలు ఉపయోగపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సహకారంతో భారత్లో నీతి ఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటిస్తోంది. అంతర్జాతీయంగా పోటీ పడే స్ధాయిలో రాష్ట్రాల్ని ఉంచేందుకు ఈ సూచీలో ఇచ్చిన లక్ష్యాలు ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ చెబుతోంది. 2030 కల్లా 17 లక్ష్యాలు, 169 సంబంధిత టార్గెట్స్ను అందుకునేందుకు ఇవి పనికొస్తాయని చెబుతోంది.