ఇంటికి తీసుకెళ్లి తాగాల్సిందే: ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం
న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం విధానాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఫైవ్స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు జడ్జిలు విక్రమజిత్ సేన్, శివ కీర్తి సింగ్లతో కూడిన ధర్మాసనం సమర్ధించింది.
కేరళ బార అసోసియషన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ మంగళవారం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే, ఉమెన్ చాందీ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. కేరళలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలను విక్రయిస్తూ ఉంటుంది.
అయితే సదరు మద్యాన్ని బయటే తాగేందుకు అప్పటిదాకా అందుబాటులో ఉన్న బార్లను ప్రభుత్వం రద్దు చేసింది. బార్ను ఏర్పాటు చేయాలంటే ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి ఉండాలని ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీ ప్రకారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 24 ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బార్లు ఉన్నాయి.
దీంతో అప్పటివరకు మద్యం విక్రయాలు జరుపుతున్న బార్లన్నీ రద్దయాయి. దీంతో కేరళ ప్రభుత్వ నిర్ణయం వివక్షతో కూడుకొని ఉన్నదంటూ బార్ యజమానులు ఆందోళనకు దిగారు. ఈ నిర్ణయంతో తాము వ్యాపారం కోల్పోతున్నామని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బార్ యజమానులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనకే మొగ్గు చూపుతూ బార్ అసోసియేషన్ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషిన్ దాఖలు చేశారు.
ఆసోసియేషన్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఇకపై మద్యం సేవించాలనుకునే వారు సర్కారీ వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేయాలి. నేరుగా ఇంటికి తీసుకెళ్లి తాగాలి. ఫైవ్స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.