లైంగిక వేధింపులు, హత్య?: 52రోజుల్లో అక్కాచెల్లెళ్లు ఒకేలా మృతి
కేరళలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 52 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోవడానికి ముందు వీరిద్దరూ కూడా లైంగిక వేధింపులకు గురవడం గమనార్హం.
త్రిస్సూర్: కేరళలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 52 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోవడానికి ముందు వీరిద్దరూ కూడా లైంగిక వేధింపులకు గురవడం గమనార్హం.
విగత జీవిత జీవిగా వేలాడుతూ..
పాలక్కడ్ జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక నాలుగు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటి వచ్చి చూసేసరికి ఆ చిన్నారి వేలాడుతూ కన్పించింది. దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు.
లైంగిక వేధింపులు..
బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది. కాగా.. సరిగ్గా 52 రోజుల క్రితం మృతురాలి 14ఏళ్ల అక్క కూడా ఇంట్లో ఉరివేసుకుని మృతి చెంది కన్పించడం గమనార్హం. ఆమె కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు అప్పుడు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఇద్దరు కూతుళ్లపైనా..
పెద్దకూతురిని తమ బంధువైన ఒక వ్యక్తి లైంగిక వేధించాడని.. అప్పటి నుంచి అతడిని తమ ఇంటికి రానివ్వడం లేదని మృతుల తల్లి మీడియాకు తెలిపింది. పెద్ద కుమార్తె మృతిచెందిన రోజు ఇద్దరు వ్యక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం చూసినట్లు చిన్న కుమార్తె తనతో చెప్పిందని ఆమె పేర్కొంది.
హత్యా? ఆత్మహత్య?..
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్కాచెల్లెళ్లది ఆత్మహత్యా, లేదా ఎవరైనా హత్య చేసి ఉరికి వేలాడదీశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టామని త్రిస్సూర్ రేంజ్ ఐజీ ఆర్ అజిత్ కుమార్ తెలిపారు. కాగా, పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మరో బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందంటూ స్థానికులు మండిపడుతున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు తెలిపారు.