అవినీతి ఆర్థిక మంత్రిని పీకేయండి: హై కమాండ్
తిరువనంతపురం: బార్ లైసెన్సుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థిక శాఖ మంత్రి కే.ఎం. మణిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఆయన మీద వేటు వెయ్యాలని కాంగ్రెస్ హై కమాండ్ కేరళ ప్రభుత్వానికి సూచించింది.
ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి నిర్దేశించిందని తెలిసింది. ఇప్పుడు కే.ఎం. మణిని మంత్రి పదవి నుంచి కచ్చితంగా తప్పిస్తారని కేరళ రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేరళలో ప్రమాణాలు పాటించని పలు మద్యం షాప్ ల లైసెన్సులు రద్దు చేశారు.
మద్యం షాప్ ల లైసెన్సులు పునరుద్దరించేందుకు కేరళ ఆర్థిక శాఖ మంత్రి రూ. ఒక కోటి లంచం తీసుకున్నారని ఓ హోటల్ యజమాని ఆరోపించారు. కేసు నమోదు చేసి విచారణ చేశారు. అయితే మంత్రి కే.ఎం. మణి లంచం తీసుకున్నారని ఆధారాలు లేవని, కేవలం ఆరోపణలు ఉన్నాయని అధికారులు కోర్టులో చెప్పారు.

అయితే కేరళ హై కోర్టు ఈ విషయంలో అధికారుల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. మద్యం షాప్ లైసెన్స్ కుంభకోణంలో మంత్రి పాత్ర ఉందని కేరళ హై కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నాయకులు భావించారు.
తాను మంత్రి పదవికి రాజీనామా చెయ్యనని, తాను ఎవ్వరిని లంచం ఇవ్వాలని డిమాండ్ చెయ్యలేదని మంత్రి కే.ఎం. మణి అంటున్నారు. అయితే కాంగ్రెస్ నిర్ణయంతో కే.ఎం. మణి మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని కేరళలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications