lockdown:కేరళ, తమిళనాడు కరోనా తగ్గుముఖం, ఇలానే ఉంటే మే 3 లోపు వైరస్ ఫ్రీ..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కానీ కేరళ, తమిళనాడులో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. కరోనా వైరస్ బయటపడింది కేరళలోనైనా.. అక్కడి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో క్రమంగా కోలుకుంటోంది. ఇటు తమిళనాడులో కూడా వైరస్ తగ్గుముఖం పడుతుంది.

వారం నుంచి..
గత వారం రోజుల నుంచి కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కి చేరింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కేరళలో 32 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 129 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన మొత్తం సంఖ్య 395.. కానీ ఏప్రిల్లో 500 వరకు పాజిటివ్ కేసులు చేరుకుంటున్నాయని వైద్యాధికారులు అంచనా వేశారు. కానీ వారి లెక్క కూడా తప్పి.. వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

277 మంది రావడంతో..
విదేశాల నుంచి 277 మంది రావడంతో కేరళలో కేసుల సంఖ్య పెరిగిందని.. కానీ వారితో కాంటాక్ట్లో ఉన్న వారిని వెంటనే క్వారంటైన్లో పెట్టడంతో వైరస్ సోకకుండా నిరోధించగలిగామని డాక్టర్ అమర్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారితో వైరస్ సోకుతున్నందున 14 రోజుల క్వారంటైన్ సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం 28 రోజుల క్వారంటైన్ చేసి.. వైరస్ను నివారించగలిగింది.

తమిళనాడులో కూడా..
ఇటు తమిళనాడులో కూడా వైరస్ సంక్రమణ తగ్గుతు వస్తోంది. శుక్రవారం ఒక్కరోజు 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 103 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే లాక్ డౌన్ సమయం లోపు రాష్ట్రంలో కరోనా వైరస్ను నిర్మూలించొచ్చు అని సూచించారు. ఇప్పటికీ తమిళనాడులో 1323 పాజిటివ్ కేసులు ఉండగా.. 283 మంది కోలుకున్నారు. 15 మంది చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 3202 మందికి వైరస్ సోకగా.. 194 మంది చనిపోయారు. 164 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications