అవి ఇవే: పెరగనున్న మెడిసిన్స్ ధరలు..ఔషధాలపై 50శాతం పెంపు ఉండే అవకాశం
ముంబై: నిత్యం వినియోగించే ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. ఇందులో యాంటీబయోటిక్స్, యాంటీ అలర్జిక్స్, యాంటి మలేరియా డ్రగ్స్ వంటి ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి. అంతేకాదు బీసీజీ వ్యాక్సిన్ మరియు విటమిన్ సీ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తొలిసారిగా ఎక్కువగా వినియోగంలో ఉన్న మెడిసిన్స్పై ఔషధ నియంత్రణ సంస్థ 21 మెడిసిన్స్ ధరలను రివైజ్ చేసింది. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలను 50శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ 2013లో పొందుపరిచిన ప్రొవిజన్ ప్రకారం ఔషధాల ధరలను పెంచుతున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ( ఎన్పీపీఏ ) చెప్పింది. ఇప్పటి వరకు మెడిసిన్ ధరలను తగ్గించేందుకు మాత్రమే ఈ ప్రొవిజన్ను ఉపయోగించేవారు. ఉదాహరణకు గతంలో కార్డియాక్ స్టెంట్లు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ వంటి పరికరాల ధరలను తగ్గించే సమయంలో డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ 2013లో ఉన్న పారాగ్రాఫ్ 19ని ఉపయోగించారు. గత రెండేళ్లుగా ధరలు పెంచాలని పలు ఫార్మా కంపెనీలు ఔషధ నియంత్రణ సంస్థ వద్ద మొర్రపెట్టుకుంటున్న నేపథ్యంలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఔషధాలను తయారు చేసేందుకు కావాల్సిన ముడిసరుకుల ధరలు పెరుగుతున్నాయని ఔషధ నియంత్రణ సంస్థ దృష్టికి ఫార్మా కంపెనీలు తీసుకొచ్చాయి. ఇక ఔషధాలను తయారు చేసే పదార్థాలు చైనా నుంచి దిగుమతి చేస్తుండగా వాటి ధరలు ఏకంగా 200శాతంకు పెరిగాయి. చైనా ఫ్యాక్టరీల్లో పరిస్థితులు క్షీణించడం పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటుండటంతో ఆ ప్రభావం ఔషధ తయారీ సంస్థలపై భారీగా పడింది. డిసెంబర్ 9న జరిగిన ఎన్పీపీఏ సమావేశంలో 21 మెడిసిన్స్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుతం తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ కామన్ మెడిసిన్స్ను ప్రథమ చికిత్స కోసం వినియోగిస్తారు. అంతేకాదు ఈ మెడిసిన్స్ను కొనసాగించరాదని కోరుతూ కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
మెడిసిన్స్ ధరలు పెంచుతూనే అవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. నిత్యం మార్కెట్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఔషధ సంస్థలదే అని ఎన్పీపీఏ పేర్కొంది.












Click it and Unblock the Notifications