కిడ్నీ రాకెట్ ముఠాను పట్టించిన భార్యభర్తల గొడవ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు అయింది. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకితీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు ఢిల్లీలోని ఇంద్రప్రస్త అపోలో ఆసుపత్రి సిబ్బంది కాగా, ఒక మధ్యవర్తి, మరో ముగ్గురు కిడ్నీ దాతలు ఉన్నారు.
ముగ్గురు కిడ్నీ దాతల్లో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. ఈ కిడ్నీ ముఠా ఇప్పటి వరకు రాజధాని ఢిల్లీలో నాలుగు కిడ్నీలను అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే ఈ కిడ్నీ ముఠాను పట్టించిందని పోలీసులు తెలిపారు.
భార్య అనుమతి లేకుండా ఓ భర్త ఆమె కిడ్నీని అమ్మాడు. అయితే డబ్బు విషయంలో వీరిద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలోనే గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఈ కిడ్నీ వ్యాపారం వెలుగు చూసింది. దీంతో కిడ్నీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అపోలో ఆసుపత్రిపై గురువారం రాత్రి దాడులు చేశారు.
ఈ దాడుల్లో కిడ్నీ ముఠా నాలుగు కిడ్నీలు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఈ కిడ్నీ మాఫియా టార్గెట్ చేసి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులైన ప్రజలకు డబ్బు ఆశ చూపించి ఇలా చేస్తున్నారు.
ఈ కిడ్నీ ముఠా కేసులో అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ మూత్ర పిండాల వైద్య నిపుణుడు డాక్టర్ అశోక్ సరిన్కు సన్నిహితంగా ఉండే ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నీ ముఠా వెనుక ఉన్న మాస్టర్ మైండ్ వ్యక్తిగా అనీష్ అని పోలీసులు గుర్తించారు.
ఈ కిడ్నీ రాకెట్ ముఠాపై ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పోలీసులకు ఎటువంటి సాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో యాజమాన్యం చెప్పింది.