దయ లేకుండా కాల్చి పారేయండి: నోరుజారిన కర్ణాటక ముఖ్యమంత్రి, ఆవేశపడ్డానని వివరణ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన టేప్ వెలుగు చూసింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టేప్లో ఉన్న దాని ప్రకారం... ఆయన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... దయ, జాలి లేకుండా చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన నాయకుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి, అతనిని చంపిన వారిని దయ లేకుండా కాల్చిపారేయమని పోలీసులను ఆదేశించడం గమనార్హం.
ఎవరైనా కాల్చిపారేయండి
అతను (ఆ జేడీఎస్ నాయకుడి పేరు ప్రకాశ్) చాలా మంచివాడని, అతనిని ఎవరు చంపారో నాకైతె తెలియదు కానీ, ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా జాలి, దయ లేకుండా కాల్చి పారేయండి, ఎలాంటి సమస్య రాదని ముఖ్యమంత్రి కుమార స్వామి పోలీసు అధికారుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానిక జర్నలిస్టులకు వీడియో తీశారు.
అక్కడే ఉన్న జర్నలిస్టులు రికార్డ్ చేశారు
మాండ్య ప్రాంతానికి చెందిన జేడీఎస్ నేత హెచ్ ప్రకాశ్ను సోమవారం కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రకాశ్ కారును అడ్డగించి కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. దీంతో కుమారస్వామి అవతలి వ్యక్తికి కాల్చి పారేయమని ఆదేశాలు ఇచ్చారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు కొందరు కుమారస్వామి మాటలను వీడియో రికార్డ్ చేశారు.
వీడియో ప్రసారం
ఇది స్థానిక మీడియాలో ప్రసారం అయింది. దీంతో విషయం వెలుగు చూసి, వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి అయి ఉండి హింసను ప్రేరేపించడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై కుమారస్వామి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
ఆవేశంలో నోరు జారా
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో తాను ఆవేశంలో అలా మాట్లాడానని కుమారస్వామి వివరణ ఇచ్చారు. హత్య చేయమని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం అవి ఆవేశంలో అన్న మాటలని చెప్పారు. అది తన ఆదేశం కాదని, ఆ క్షణంలో తాను ఉద్వేగానికి లోనయ్యానని, ఘటనకు కారణమైన వారు ఇప్పటికే రెండు హత్యలు చేసి జైలుకు వెళ్లారని, రెండు రోజుల క్రితమే బెయిల్పై వచ్చారని, మళ్లీ మరో వ్యక్తిని చంపేశారని, బెయిల్ను వారు ఇలా దుర్వినియోగం చేశారని, అందుకే ఆవేశంలో అలా మాట్లాడానని చెప్పారు.