టిని ప్రణబ్ ఆపుతారు: కిరణ్ 4పేజీల లేఖ, ఏకాంత చర్చ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆపుతారనే ధీమాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం వ్యక్తం చేశారు. ఆయన సాయంత్రం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని, అసెంబ్లీ కూడా తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించిన విషయాన్ని చెప్పామని, ప్రణబ్ ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు.
దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు రాష్ట్ర అసెంబ్లీ బిల్లును తిరస్కరిస్తే ఏర్పడిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో అందుకు విరుద్దంగా జరుగుతోందన్నారు. విభజన ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి తప్ప వారికి నష్టం చేసేలా ఉండవద్దన్నారు. ఇదే విషయాన్ని తాము ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రజాభిప్రయానికి విజయం చేకూరుతుందని భావిస్తున్నానని తెలిపారు.
తాను ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ముందు నిలబడి మాట్లాడుతున్నానని, ప్రజాభీష్టం మేరకు ప్రణబ్ సరైన నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ ముసాయిదా బిల్లు తిరస్కరించి వెనక్కి పంపించిందని చెప్పారు. విభజన జరిగితే రాష్ట్రంలో ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టమే అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి నాలుగు పేజీల లేఖను అందజేశారు. అందులో విభజన ద్వారా తలెత్తే సమస్యలను, అసెంబ్లీ బిల్లును తిరస్కరించిన అంశాన్ని తెలిపారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంత నేతలు అందరు బయటకు వచ్చాక ముఖ్యమంత్రి రాష్ట్రపతితో పది నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు.
అంతకుముందు మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము రాష్ట్రపతిని కోరామన్నారు. హైదరాబాదు రాజధాని కాబట్టి అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతమైన విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు నష్టమని, నదీ జలాల సమస్యలు తలెత్తుతాయని చెప్పామన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు చెప్పారు.