తమిళ సినీ నటులకు శ్రీమంతుడు సెగ: దత్తత తీసుకోండి
చెన్నై: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో నటించిన వేళా విశేషం ఏమిటో గానీ, సినిమాలో హైలెట్గా నిలిచిన గ్రామాల దత్తత పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. తాజాగా ఈ గ్రామాల దత్తత కార్యక్రమం తమిళనాడు సినీ నటులను తాకింది.
తమిళనాడులో కూడా చాలా గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, వాటిని తమిళ సినీ నటులు దత్తత తీసుకోవాలని కేజేకే(కొంగునాడు జననాయక కట్చి) అధ్యక్షుడు జీకే నాగరాజ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు తెలంగాణలోని మహబాబ్ నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
అదే విధంగా తన తండ్రి సొంతూరైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ దత్తత గ్రామాల్లో మహేష్ బాబు పర్యటించనున్నారు. ఇక మంగళవారం తెలంగాణ పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్లోని కొండారెడ్డి పల్లెను దత్తత తీసుకున్నారు.
ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో చాలా గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, వాటిని కూడా దత్తత తీసుకోవాలని తమిళ సినీ నటులను నాగరాజ్ కోరారు.
ఇప్పటికీ చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు, నీటిసరఫరా వంటి సదుపాయాలు లేవని, పురుషులు తాగుడుకు బానిసలై మహిళలను హింసిస్తుంటారని ఆయన అన్నారు. తమిళ సినీ నటులంతా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.