మోడీకి 'కోహినూర్' షాక్: కాకతీయుల నుంచి.. చరిత్ర చెప్పి స్వామి ఆగ్రహం
న్యూఢిల్లీ: కోహినూర్ను బ్రిటన్ ఎత్తుకెళ్లలేదని, దానిని కానుకగా ఇచ్చామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వాదనతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఏకీభవించడం లేదు. సోమవారం కోహినూర్ వజ్రం విషయమై నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం సుప్రీం కోర్టుకు.. అది దొంగిలించబడలేదని చెప్పిన విషయం తెలిసిందే.
దీనిని ఆరెస్సెస్ తప్పుబట్టింది. కోహినూర్ వజ్రం భారత దేశం యొక్క ఆస్తి అని చెప్పింది. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. కోహినూర్ వంద శాతం భారత్ ఆస్తి అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కోహినూర్ను తిరిగి భారత్ రప్పించాల్సిందేనని చెప్పారు. కాగా, కోహినూర్ వజ్రం 108 క్యారెట్ల బరువు ఉంటుంది.
కోహినూర్ వజ్రం విషయంలో కేంద్రం తీరును బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా తప్పుబట్టారు. కేంద్రం సుప్రీం కోర్టుకు ఇచ్చిన వివరణపై మండిపడ్డారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారు.
సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ... కోహినూర్ వజ్రం తొలి ప్రొడక్షన్ వరంగల్లోని కాకతీయ రాజుల సమయంలో జరిగిందని చెప్పారు. దీనిని గుంటూరు గనుల నుంచి తీసుకు వచ్చారని చెప్పారు. ఆ తర్వాత దీనిని ముఘల్ రాజులకు, మహారాజా రంజిత్ సింగ్ చేతకు చేరిందని తెలిపారు.
ఆ తర్వాత మహారాజా రంజిత్ సింగ్ అనారోగ్యానికి గురయ్యాడని, తాను చనిపోతున్నానని అతను గుర్తించాడని, దీంతో అతను ఆ కోహినూర్ వజ్రాన్ని జగన్నాథ్ మందిరానికి అందించారని చెప్పారు. అది ఫైనల్ అని, దానిని ఎవరూ మార్చలేరని చెప్పారు.
మహారాజా రంజిత్ సింగ్.. పదమూడేళ్ల కొడుకు దిలీప్ సింగ్ బ్రిటిష్ వారి ట్యూటర్ అని, ఓ సమయంలో బ్రిటిష్ రాణి విక్టోరియాని కలిసినప్పుడు.. తన వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని రాణికి కానుకగా ఇచ్చాడని, ఆ తర్వాత దిలీప్ సింగ్ దానిని కానుకగా ఇచ్చినందుకు పశ్చాత్తాప పడ్డాడని చెప్పారు. ఇవన్నీ రికార్డులుగా ఉన్నాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ అడిషనల్ జెనరల్ అండ్ సొలిసిటర్ జనరల్కు చరిత్రను మంచిగా చదవమని చెప్పాలన్నారు. ఆ తర్వాత కొత్త అఫిడవిడ్ దాఖలు చేయాలన్నారు. కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పిన విషయమై ఇటు ఆరెస్సెస్, అటు సుబ్రహ్మమ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.