ఒక్కొక్కరి సంగతి చూస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కల్పించారని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు బుధవారంనాడు వెల్లోకి పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అన్యాయం జరిగితే సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. పదవులతో డబ్బులు సంపాదించుకుంటున్నారని, కాంగ్రెసు అధిష్టానం దయతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులను పెట్టి శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారని ఆయన అన్నారు.
సీమాంద్ర ఎంపీల చర్యల నుంచి కాపాడడానికి తాము రక్షణగా పార్లమెంటులో ఉన్నామని ఆయన అన్నారు. శాసనసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని, పార్లమెంటులో కూడా వారు చెప్పినట్లే జరగాలా అని ఆయన అన్ారు. ప్రతిష్టాత్మకంగా తీసుుకని పార్లమెంటుకు తెచ్చిన బిల్లును సిగ్గుశరం లేకుండా అడ్డుకోవాలని చూడడం ఎంత వరకు న్యాయమని ఆయన అడిగారు. తెలంగాణ కావాలా, వద్దా అనేది తెలంగాణ ప్రజలు చెబుతారు గానీ సీమాంధ్ర నేతలు చెప్పడమేమిటని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి కాంగ్రెసు, ప్రభుత్వం ముందుకు వచ్చాయని ఆయన అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడే సీమాంద్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అప్పుడే పదవి నుంచి తప్పించి ఉంటే బాగుండేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పచ్చి రౌడీల్లా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధిష్టానం సహనాన్ని, మెతకవైఖరిని ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం తెలంగాణ వచ్చినట్లేనని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తమదని ఆయన అన్నారు.
సీమాంధ్ర ఎంపీల తీరు వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. అన్యాయం, దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ధర్మం, న్యాయం ఎవరి వైపు ఉందీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము ఇన్నాళ్లు సహనంతో ఉన్నామని, తెలంగాణకు అడ్డు తగలాలని చూస్తే సహించబోమని ఆయన అన్నారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావాలనే ఉద్రిక్త పరిస్థితులను కల్పించారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాము దాడి చేసినట్లు సీమాంధ్ర నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. సభకు అంతరాయం కలగకుండా తాము చూశామని ఆయన అన్నారు. వారే కొట్టారు, వారే అల్లరి చేసి తమపై నెడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.