కథువా రేప్.. చిన్నారిపై విద్వేష వ్యాఖ్యలు: కొటక్ మహీంద్రా ఉద్యోగి తొలగింపు
తిరువనంతపురం: కథువా రేప్ చిన్నారి ఘటనను ఆసరాగా చేసుకుని హిందు-ముస్లిం వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సున్నితమైన అంశం పట్ల కొంతమంది నోరు జారుతుండటం కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది.
తాజాగా ఓ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగి కథువా చిన్నారి హత్యాచారంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో నెటిజెన్లు అతనిపై భగ్గుమన్నారు. 'చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో' అంటూ అతను చేసిన పోస్టుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
అంతేకాదు, అతను పనిచేస్తున్న కొటక్ మహీంద్రా బ్యాంకును కూడా నెటిజన్లు హెచ్చరించారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని, లేకపోతే బ్యాంకుపై దాడి చేస్తామని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
ఈ నేపథ్యంలో బ్యాంక్ యాజమాన్యం విష్ణు నందకుమార్ అనే సదరు ఉద్యోగిపై వేటు వేయడం గమనార్హం. ఏప్రిల్ 11న అతన్ని తొలగించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేసింది. అయితే పని తీరు సరిగా లేని కారణంగానే అతన్ని తొలగిస్తున్నట్టు కొటక్ యాజమాన్యం తెలపడం గమనార్హం.